Monday, March 19, 2012

Song of the week - Vandemaatara geetham


ముందు మాట : Instead of posting same matter every time, providing the link to one of the earlier posts. ( What inspired me to write this series)

Movie Name: వందేమాతరం
Producer: పోకూరి బాబురావు
Director: తొట్టెంపూడి కృష్ణ
Music Director: చక్రవర్తి
Singer(s): "వందేమాతరం" శ్రీనివాస్
Lyrics: C నారాయణ రెడ్డి
Year of Release: 1985


వందే మాతరం.. వందే మాతరం..
వందే మాతరం.. వందే మాతరం..
వందే మాతర గీతం వరస మారుతున్నది (2 )
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది

సుజల విమల కీర్తనలో సుఫలాసయ వర్తనలో (2 )
జలం లేక బలం లేక జనం ఎండుతున్నది
మలయజ సీతల పదకోమల భావన బాగున్నా
కంటి కంటిలో తెలియని మంట రగులుతున్నది మంట రగులుతున్నది
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది || వందే మాతరం.. వందే మాతరం..||

సస్యశ్యామల విభవస్తవ గితాలాపనలో (2 )
పైరు నోచుకోని బీళ్ళు నోళ్ళు తెరుస్తున్నవి
శుభ్రజ్యోత్స్న పులకిత సురుచిర యామినులలోన
రంగు రంగు చికట్ల గిరాకి పెరుగుతున్నది గిరాకి పెరుగుతున్నది
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది || వందే మాతరం.. వందే మాతరం..||

పుల్లకుసుమిత ద్రుమదల వల్లికామ తల్లికలకు (2 )
చిదిమి వేసిన వదలని చీడ అంటుకున్నది
సుహాస సంపదలకేమి సుమధుర భాషనలకేమి
ముసి ముసి నవ్వుల మాటున విషం మరుగుతున్నది
ప్రజా సుఖమే తమ సుఖమని వరదానాలిస్తున్నా
ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నది (2 ) అక్కడనే ఉన్నది || వందే మాతరం.. వందే మాతరం..||

తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది


ఈ పాట శ్రీనివాస్ గారి సినీ జీవితం లో పాడిన మూడవ పాట. ఆయన పాడిన మొదటి పాట మాదాల రంగారావు గారి "స్వరాజ్యం" సినిమా. రెండోవ సినిమా నేటి భారతం అది కూడా టి. కృష్ణ గారిదే. ఈ పాట శ్రీనివాస్ గారు పాడిన మూడవ పాట. ఈ పాట నారాయణ రెడ్డి గారు రాసిన తరువాత ప్రజా నాట్య మండలి వాళ్ళు స్వరపరచి పాడుకుంటూ ఉండేవారు. ఆ సంస్థ కి చెందిన శ్రీనివాస్ గారు ఒంగోలులో జర్నలిస్ట్ శ్రీరాం గారి ఇంట్లో జరిగిన వివాహం సందర్భం గా పాడినప్పుడు, టి.కృష్ణ గారు ఆ పాట విని నచ్చి, పాట గురించి వివరాలు అడగటం, నారాయణ రెడ్డి గారు రాసిన ఈ పాట అని శ్రీనివాస్ గారు చెప్పగా, టి కృష్ణ గారు సి. నారాయణరెడ్డి గారి తో సంప్రదించి, ఈ పాట, అదే బాణి తో యథా తథంగా సినిమా లో పెట్టు కోవటం జరిగింది. అంతే కాకుండా సినిమా పేరు, చివరికి శ్రీనివాస్ గారు వందే మాతరం శ్రీనివాస్ గా మారటం జరిగింది. అప్పటికే చాల మంది శ్రీనివాస్ లు సిని పరిశ్రమం లో ఉండటం వల్ల అలాగ స్థిరపడి పోయారు వందేమాతరం శ్రీనివాస్ గారు. ఒక ఇంటర్వ్యూ లో ఈ వివరాలన్నీ చెప్పారు వందేమాతరం శ్రీనివాస్ గారు.


టి.కృష్ణ గారు అతి తక్కువ కాలం లో అర్థ వంతమైన సినిమాలు తీసి ఈ ప్రపంచం నుంచి అంతే వేగం గా అంతర్థానం అయ్యారు. ఆయన సినీ జీవితం మూడు సంవత్సరాలైనా ఆయన సినీ చరిత్ర లో చిరాయువును పొందిన వాళ్ళలో ఒకరు. ఆయన తీసినవి అర్థవంతమైన, ఆయనకీ విప్లవ సినీ దర్శకుడు అనే ముద్రని ఇచ్చేసారు సినీ పండితులు/విమర్శకులు. విప్లవం అంటే పోరాటం. కాని మనలోని లోపాలని ఎత్తు చూపేవి విప్లవం కాదేమో. ఏది ఏమైనా టి.కృష్ణ గారు తన సినిమా తో సమాజ పరిస్థితులని అద్దం పట్టి చూపించే ప్రయత్నాలు చేసి మన్ననలను పొందారు. ఈ వందే మాతరం సినిమా కూడా అదే కోవకు చెందినదే.

వందే మాతరం 1882 లో బంకిం చంద్ర చట్టర్జీ రాసిన బెంగాలి-సంస్కృత పద్యం. ఇది ఆనంద మాత అనే నవలలో రాసుకున్నది. ఒరిజినల్ పాటలో ఆరు చరణాలు ఉండగా అందులో మొదటి రెండు పద్యాలు (చరణాలు) తీసుకొని భారత రాజ్యాంగ దినం సందర్భం గా జాతీయ గీతం గా మార్చ బడింది. దుర్గా మాత మీద రాసిన ఈ పాట లోని మొదటి రెండు చరణాలు భారత మాత మీద అన్వయించుకొని పాట లోని మిగితా పద్యాలు వదిలెయ్యటం జరిగింది. ఈ జాతీయ గీతం భారతీయులు అత్యంత గౌరవం తో పాడుకొనే పాట. మొదటి సారి రబీంద్ర నాథ్ టాగూర్ 1896 Indian National Congress సదస్సు లో పాడగా ప్రాచుర్యం పొందింది. భారత స్వాతంత్ర్యం ముందు ఈ పాట ఎందరినో ఉత్తేజ పరచింది. బ్రిటిష్ వారు ఈ వందేమాతరం పదాన్ని బహిష్కరించటం కూడా జరిగింది. కాని ఇందులో దుర్గా మాత మీద పాట కారణం గా ఇతర మతస్తులకి ఇబ్బంది కలుగుతుంది అని ప్రార్థన గీతం గా తిరస్కరింపబడి, జాతీయ గీతం గా మారింది. ఎంతో గౌరవం, ఎంతో చరిత్ర కలిగిన ఇటువంటి పాటలని మార్చటం భావ్యం కాదు. ఈ వందేమాతరం సినిమాలో సినిమా పాటగా మార్చి పిల్లల చేత మాష్టారు పాడించటం సహించలేక తనలోని ఆవేదనని, ఆవేశాన్ని ఈ పాట రూపం గా పాడతాడు, సమాజ పరిస్థితులని వేలు ఎత్తి చూపుతూ దేశం ఎలా గతి తప్పుతోందో ఈ పాట ద్వారా చెప్తాడు కథానాయకుడు. తను ఊహించిన భారత మాత, జాతీయ గీతం లో వివరించిన భారత మాత ఎలా మారిపోతోందో చూడలేక ఆవేదనని వెల్లకక్కుతాడు కథానాయకుడు.

సి. నారాయణ రెడ్డి గారు పరిచయం అవసరం లేని బహుముఖ ప్రజ్ఞాశాలి. అయన ఈ పాట ఎంత ఆలోచనతో రాసారో, అదే భావాన్ని హృదయాలని తాకేటట్లు పాడతారు వందేమాతరం శ్రీనివాస్ గారు. ఈ పాట విన్న తరువాత ఒక్క క్షణం దేశం గురించి ఆలోచన రావటం అత్యంత సహజమైన భావం. కృష్ణ గారు సినిమాలో పాట స్వరం మార్చినట్టు చూపినా అసలైన భారత దేశం రూపు గతి మారిపోయింది అది ఎలా మారుతోంది అని చాల నిశితం గా ఎవరిని ఆరోపించకుండా సున్నితం గా రాసారు నారాయణ రెడ్డి గారు. జాతీయ గీతం లోని ప్రతి పదం వాడుకొని అది ఎలా మారిందో చెప్పే ప్రయత్నం చేసారు. అందుకే ఈ పాట వినే ముందు జాతీయ గీతం వినటం ఎంతైనా అవసరం,ఆ గీతం అర్థం అవ్వటం కూడా అవసరం. భారత దేశం ఒక్క గొప్పతనం ఎంతో సుందరంగా వర్ణించే వందేమాతర గీతం తరాలు మారుతున్న రీతి లో ఆ గొప్పతనం, సహజమైన సుందరం ఎలా కోల్పోతున్నదో ఎంతో ఆవేదనతో వివరించటం జరుగుతుంది. ఈ మార్పుకి ఎవరిని నిందించకుండా రాయటం వల్ల ఆ పాటకి వివాద రహితమైన ప్రాచుర్యం లభించింది. వందేమాతరం శ్రీనివాస్ గారి గళం సహజమైన వరం. ఆ గొంతులో అంతులేని ఆవేదన పలుకుతుంది. ఆయన ఎప్పుడు చిరునవ్వుతో ఉంటారు, అందరిని పలుకరిస్తారు, కాని అయన గొంతులో ఇంతటి ఆవేదన, విషాదం పలకటం ఆయనకి సహజ సిదం గా లభించిన కటాక్షం. అందుకే ఆయనకి ఎందరి గొంతుల్లో మారు మ్రోగిన వందేమాతరం ఇంటి పేరు గా మారటం అయన చేసుకున్న అనేక జన్మల సుకృతం.

ఇంక పాట లోకి వెళ్తే,


వందే మాతరం.. వందే మాతరం..
వందే మాతరం.. వందే మాతరం..
వందే మాతర గీతం వరస మారుతున్నది (2 )
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది


సుకృతం. వందే మాతరం అంటే ఓ మాత నీకు వందనం. స్వాతంత్రం రాక ముందు ఈ పదం ప్రతి భారతీయుడి నోట పలికిన పదం ఇది. ఆంగ్లేయుని గుండెలో భయం నింపిన పదం ఇది. స్వరాజ్యం కాంక్షించే ప్రతి మనిషిని ఏకం చేసిన పదం ఇది. స్వరాజ్యం అంటే తెలియని వాళ్లకి అది ఎంతో తెలియ చెప్పిన పదం ఇది. అటువంటి పద గీతం వందేమాతరం గీతం. ఆ పాట స్వరం మారుతోంది, పాడే విధానం మారుతోంది, దానికి ఉన్న గొప్పతనం తగ్గిపోతోంది, తరాలు మారుతున్న మనం అనేక విధానాలు గా మారుతున్నాం. ఒక విధంగా చూస్తె వందేమాతర గీతం అంటే ఒకప్పుడు ఉన్న గౌరవం పోయింది. అట్లాగే కొత్త తరంకి ఈ పాట గురించి కాని, పాట ఒక్క చరిత్ర కాని, ఈ పాట ఎందుకు పాడాలి అనే విషయాలు తెలియవు. అంతే కాక  చాల మందికి ఈ పాట చూడకుండా పాడటం కూడా రాదు. ఈ పాట చాల బళ్ళలో పాడించటం కూడా తగ్గి పోయింది. వందేమాతరం పాట కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ విషయాలన్నీ పాట రీత్యా చూస్తె, కాని భారత మాత దృష్ట్యా చూస్తె పాటలో వర్ణించినట్లుగా భారత దేశ రూపు రేఖలు మారిపోతున్నాయి, ఎంతో గొప్పగా వివరించిన భారత మాత తన స్వరూపమే కోల్పోయింది, తరాల మార్పు తో . భారత దేశపు ఉన్నాయా విలువలు, భావాలు తెలియ చెప్పే లక్షణాలు అన్ని మాయం అయిపోతున్నాయి. అవి అన్ని రాను రాను కరువై పోతున్నాయి. అందుకే వందేమాతర గీతం భారత మాత గీతం, ఆ గీతం ద్వారా వివరించిన భారతమాత మారిపోతోంది, ఏది ఎలా మారుతోంది అనేది అసలు పాట మొత్తం విని ఆ పాట లో ఎలా వివరింప బడి ఉంది ఆ అంతరం ఎలా ఉంది అనే విషయాలు వివరిస్తారు సి. నా. రే.

సుజల విమల కీర్తనలో సుఫలాసయ వర్తనలో (2 )
జలం లేక బలం లేక జనం ఎండుతున్నది
మలయజ సీతల పదకోమల భావన బాగున్నా
కంటి కంటిలో తెలియని మంట రగులుతున్నది మంట రగులుతున్నది
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది || వందే మాతరం.. వందే మాతరం..||


భారత దేశంలో ఉన్న నదులన్నీ ఒకప్పుడు దేశం మొత్తం పారుతూ అందాన్ని తేవటమే కాకుండా ఆ పారిన భూమి కి బలం తెచ్చి, పంటలు పండించి ఆహరం ప్రసాదించేవి. అందుకే భారత దేశం ఎప్పుడు  నీరు తో నిండు ఉండేది. ఆ ఆహారం అందరికి సరిపోయి జనాలకి బలం చేకూర్చేది. కాని కాల రీత్యా జరుగుతున్నామార్పుల వలన జనం పెరిగి, జాలం లేక, పొలం దున్నలేక, ఆహారం పండించలేక ఆహరం కొని తినే స్తోమత లేక జనాలు చిక్కి పోయి ఆకలి తో ఎండిపోతున్న దృశ్యం ఒక వైపు అయితే, నదీ జలాలు కరువయ్యి భూములు ఎండిపోతున్నాయి. భారత దేశం సస్య శ్యామల దేశం గా చరిత్ర చెపుతుంది, ఎప్పుడు ఆహార లేమి తెలియకుండా ఉండటం కూడా చరిత్ర లో చూస్తాం,  అనేక  రకాల ఆహార దినుసులు పండేవి కాని ఇప్పుడు పరిస్తితి అలాగ కాదు. మనకి వచ్చే ఋతు పవనాలు, చల్లటి  గాలులు ఇవ్వన్ని బాగున్నాయి అనిపించినా ,దేశాన్ని ప్రేమించిన వాళ్ళకి ఇవన్ని చూస్తె ఎంత ఆవేశం కలుగుతోందో  మనకి తెలుసు. ఎప్పుడైనా ఏదైనా దేశం అభివృద్ధి దిశగా పయనించాలి, కాని భారత దేశంలో జరుగుతున్న అరాచకాలు తెచ్చే మంట, కసి కోపం రగిలిస్తూ , దేశం ఒక్క అభివృద్ధి స్వరం మారుతోంది అంటారు సి  నా  రే .

సస్యశ్యామల విభవస్తవ గితాలాపనలో (2 )
పైరు నోచుకోని బీళ్ళు నోళ్ళు తెరుస్తున్నవి
శుభ్రజ్యోత్స్న పులకిత సురుచిర యామినులలోన
రంగు రంగు చికట్ల గిరాకి పెరుగుతున్నది గిరాకి పెరుగుతున్నది
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది || వందే మాతరం.. వందే మాతరం..||


భారత  దేశ  పల్లెటూర్ల పచ్చదనం మన దేశానికి బలం, అదే మన దేశ ఆయువు పట్టు, మన రైతులకి బలం, మనందరికీ ఆనందం. అలాంటిది, సరి ఐన నీరు లేక, నీరు ఉన్న పొలం కి సరిపడా నీరు అందించే యంత్రాలు అందుబాటులో లేక ఎదుగుతున్న పైరు కి నీరు అందించలేక మనం ఏమి చెయ్యక భూమి లో పండించే తాహతు లేక ఇలాగ అనేక కారణాల వల్ల భూమి బీడు గా మారి పోతోంది, భారత మాత అంటేనే సస్య శ్యామల మైన పొలాలు. అవి లేక భూమి పగిలి నోరు తెరచినట్లు విరిగి పోతోంది. అంటే కాక  పచని చేలు, నదీ జలాల మీద వెన్నెల పారుతుంటే ఆ చూపు తో పులకించిన భారత మాత రంగు మార్చి, చీకటి లో రంగు రంగు వ్యాపారాలకి గిరాకి పెరిగి పోతోంది. దేశం భ్రష్టు పట్టి పోతోంది, నదీ ప్రవాహాల హోయలలో, గాలికి ఊగుతూ పంట చేలు చేసే శబ్దాల తో పులకరించే భారత మాత అవి అన్ని కరువయ్యి గతి తప్పి వేరే దారి లో ప్రయాణం చేస్తుంటే తరం మారుతున్న భారత  దేశ  స్వరం మారుతోంది కదా.. 

పుల్లకుసుమిత ద్రుమదల వల్లికామ తల్లికలకు (2 )
చిదిమి వేసిన వదలని చీడ అంటుకున్నది
సుహాస సంపదలకేమి సుమధుర భాషనలకేమి
ముసి ముసి నవ్వుల మాటున విషం మరుగుతున్నది
ప్రజా సుఖమే తమ సుఖమని వరదానాలిస్తున్నా
ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నది (2 ) అక్కడనే ఉన్నది || వందే మాతరం.. వందే మాతరం..||


రాజకీయ నాయకులు నేతల మీద సున్నితంగా వేసిన విమర్సనాస్త్రం ఇది, సరిగ్గా చెప్పాలంటే మన దేశానికి పట్టిన చీడ రాజకీయం. అది వదలకుండా, ఏమి చేసిన పోకుండా అంటుకుపోయింది భారత దేశం లో.ఈ నేతలు చేసే వాగ్దానాలు వాళ్ళు చెప్పే తేనే పూసిన మాటలు, ఏదేదో చేస్తాం దేశాన్ని ఎక్కడికో తీసుకెళతాం, జనాలకి ఏదేదో హామీలు ఇచ్చి చేసే ఉపన్యాసాలు, అన్ని మధురంగా వినపడే మాటలు. ఇంక చేతలకోచ్చే సరికి ఎక్కడికి కదలవు, నేతలు వేసే ప్రణాలికలు వాటికి వేసే పునాది రాళ్ళు, రాళ్లలాగే ఉండి పోతున్నాయి, మళ్ళ ఎన్నికల సమయానికి  గాని గుర్తుకు రావు, అందుకే అంటారు సి నా రే, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది అని, టి.కృష్ణ గారు కూడా   పునాది రాయిని చూపిస్తారు. ప్రజల కోసం తమ జీవితం అంకితం అని చెప్పే నాయకులూ, సామాన్య ప్రజల బాధలు పట్టించుకోకుండా, వాళ్ళు అనేక తరాలకి సరిపడే సంపద కూడబెట్టుకుని ఆనందిస్తున్నారు. సామాన్య ప్రజలకి ఒరగపెట్టేది ఏమి లేదు. ఎంతో అందం గా అలంకరింపబడిన భారతమాత కు ఇలాంటి చీడ పట్టింది. రాజకీయం మాటున విషం మరుగుతోంది, అభివృద్ధి లేకుండా అక్కడే ఉంటోంది, అందుకే భారత గీతం స్వరం మారుతోంది అంటారు.

కొసమెరుపు: "కన్నతల్లినే ప్రేమించటం మర్చిపోయిన ఈ దేశంలో దేశ మాత గురించి ఇంతలా ఆవేదన పడుతున్న నీ లాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా కొన ఊపిరితో జీవించి ఉంది బాబు" అంటూ సినిమాలో కథానాయకుడిని పొగడుతూ చెప్పిస్తారు టి. కృష్ణ గారు. కన్న తల్లి, ఊరు, దేశం ఈ మూడిటికి, ప్రతి మనిదికి ఉండేది ఒకటే రాగం అది అనురాగం. అన్ని మర్చి పోయి స్వలాభం కోసం ఎవరికీ ఏమి చెయ్యలేక, చెయ్యటం ఇష్టం లేక, కారణం ఏదైనా కాని, దేశం ఎటు పోయిన పరవాలేదు, మనం బాగుంటే చాలు అనే ఆలోచన తో ఉన్నే ఈ తరం, ఒక్క క్షణం ఆలోచిస్తే, మనం ఏమి చెయ్యాలి అన్న ఆలోచనలో పడితే ఈ పాట సఫలీకృతం అయినట్టే. తమ కోసం అన్ని వదలుకొని ఈ వందేమాతరం అంటూ దేశ గీతాన్ని ఆలాపిస్తూ, దేశాన్ని ప్రేమించి, దేశం కోసం తమ జీవితాలు అర్పించి, మాత్రు భూమి శృంఖలాలు తెంచి బంధ విముక్తురాలుగా చేసిన అనేక మంది దేశ భక్తులకి ఆ ఆలోచనే మనం ఇచ్చే అసలైన నివాళి.  మన దేశాన్ని అభివృద్ధి బాటలో తీసుకు వెళ్ళటానికి, దానికి అడ్డుపడే, మనకు పట్టిన అన్ని చీడలు వదల్చుకొని, తిరిగి భారత దేశం సస్య  స్యామలమై , సుజలమై, మలయజ సీతలమై, కుసుమాలతో ప్రభవిల్లి, సుప్రజ్యోత్స్నా అయి, సుహాసిని అయి, సుఖద అయి, పులకించి, భరత మాత మురిసి మెరిసి పోయే రోజు raavali     అని  కళలు కంటూ ఆసిస్తూ, అందుకు కావలసిన  దానికి ఏమి చెయ్యాలో ఈ తరం ఆలోచించి ఆచరణలో మార్చి వందేమాతర గీతానికి స్వరం తిరిగి రాద్దాం.

No comments:

Post a Comment