Thursday, January 19, 2012

Song of the week - Aakasam Digivachi

 Song of the week - ఆకాశం దిగివచ్చి

ముందు మాట : Instead of posting same matter every time, providing the link to one of the earlier posts. ( What inspired me to write this series)

Movie Name:              నువ్వు నాకు నచ్చావ్
Producer:                   స్రవంతి  రవి  కిషోర్
Director:                    విజయభాస్కర్ 

Music Director:           కోటి
Singer:                      S.P. బాలసుబ్రహ్మణ్యం
Lyrics:                       సిరివెన్నెల సీతారామ శాస్త్రి
Year of Release:         2001


 ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి
ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి
చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం
ఇది వరకెరగని వరసలు కలుపుతు మురిసిన బంధుజనం
మా ఇల్ల లేత మావిళ్ళ తోరణాలన్ని పెళ్లి శుభలేఖలే 
అక్షింతలేసి ఆశీర్వదించమను  పిలుపులైనవి గాలులే ||ఆకాశం దిగివచ్చి||
చరణం 1
చంపలో విరబూసే అమ్మాయి  సిగ్గు దొంతరలు 
ఆ సొంపులకు  ఎరవేసే అబ్బాయి  చూపు తొందరలు 
ఏ వరాలో ఈ జవరాలై జతపడు సమయంలో ..
వానవిల్లే వధువుగ మారి ఒదిగిన వేడుకలో 
తన  సరసను  విరిసిన  సిరిసిరి  సొగసుల  కులుకల  కలువకు  కానుకగా 
ఎద  సరసున  ఎగసిన  అలజడి  అలలే  తాకగా ||ఆకాశం దిగివచ్చి||
చరణం 2
విన్నవారెవరసలు సన్నాయి వారి సంగతులు 
సన్న సన్నగా రుసరుసలు వియ్యాలవారి విసవిసలు 
సందు చూసి చక చక ఆడే జూద శిఖామణులూ....
పందిరంతా ఘుమ ఘుమలాడే విందు సువాసనలూ
తమ నిగనిగ నగలను పదుగురు ఎదురుగ ఇదిగిదిగో అని చూపెడుతూ 
తెగ తిరిగే తరుణుల తికమక పరుగులు చూడగా ||ఆకాశం దిగివచ్చి||
సినిమా గురించి కొన్ని మాటలు:

ఎన్ని సార్లు చూసిన అస్సలు బోర్ కొట్టని సినిమాలలో "నువ్వు నాకు నచ్చావ్" ఒకటి. దానికి కారణం సరళమైన కథ, చక్కని ఆరోగ్యకరమైన హాస్యం, "One Line Punches" తో ఆద్యంతం ఆకట్టుకుంటాయి. కొన్ని సన్నివేశాలు ఎన్ని సార్లు చూసిన నవ్వు తెప్పిస్తాయి. ఆ పాత్రలు వేసిన వాళ్ళు అంతటి నవ్వు తెప్పిస్తారు. త్రివిక్రమ్ మాటలు రాయటం లోని నైపుణ్యం, అతని ప్రతిభ ఈ సినిమా లో కనిపిస్తుంది. జంధ్యాల గారి తరువాత ఆయనంత కాకపోయినా కొంతలో కొంత మంచి సంభాషణలు అందించగలిగిన వారిలో ఒకరు. వెంకటేష్ చక్కగా తన పాత్ర లో వొదిగి పోయి నటించిన సినిమాలలో ఇది ఒకటి.

పాట సందర్భం:
హీరో తండ్రి వ్యవసాయం చేస్తూ ఉంటాడు. గాలికి తిరిగే తన కొడుకుని ఉద్యోగానికి సహాయం కోసం తన స్నేహితుడి దగ్గరకు పంపుతాడు. అక్కడ తండ్రి స్నేహితుని ఇంట్లో ఉంటూ కాలక్షేపం చేస్తూ ఉంటాడు. వాళ్ళ అవుట్ హౌస్ లో ఉంటున్న అతను ఒకసారి ఏదో పని మీద వాళ్ళింటికి వెళ్తాడు. అక్కడ అందరు చాల సీరియస్ గా హీరోయిన్ పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. హీరోయిన్ బాబాయ్ పెళ్లి పనులు మనం ఏమి చెయ్యక్కర్లేదు మ్యారేజ్ కాంట్రాక్టర్స్ కి ఇచ్చేస్తే అన్ని వాళ్లే చూసుకుంటారు, మనం కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని పెళ్లి చూసి అక్షంతలు వెయ్యటమే అంటాడు. అందరి అభిప్రాయాలూ తీసుకుంటూ హీరో ని అడిగితె అతని నుంచి మెచ్చుకోలు ఎదురు చూసిన బాబాయ్ కి చుక్కెదురు అవుతుంది. వాళ్ళ మధ్య జరిగే సంభాషణ సినిమాలో చూడాల్సిందే. అప్పుడు చివరికి బాబాయ్ హీరో ని పందిరి ఎలా ఉండాలి అని అడిగితె, హీరో పాట మొదలెడతాడు.

తెలుగు వారింట పెళ్లి అంటే అదో చెప్పరాని అనుభూతి. అందులో శాస్త్రోక్తం గా చేసే పెళ్లి చూడాల్సిందే. అది తెలియని వాళ్ళకి చెప్పటం అనేది కత్తి మీద సాము వంటిదే. ఎందుకంటే అది వివరించటానికి పెళ్లి లో జరిగే తంతులు ఒకటా రెండా, కోకొల్లలు. ఆ సరదాలు సంగతులు వేలకు వేలు. కాని ఏ సందర్భం అయిన అవలీలగా పాట రాసెయ్య గలిగిన సీతారామ శాస్త్రి గారికి ఒక లెక్ఖ?, ఈ పాట వింటే పెళ్లి అవని వాళ్ళకి ఆ అనుభవం కావాలని, అయిన వాళ్ళకి వాళ్ళ పెళ్లి నాటి ముచ్చట్లు గుర్తుకు రాక మానవు.

మంచి సాహిత్యానికి మంచి ట్యూన్ దానంతట అదే వస్తుందేమో, కోటి సమకూర్చిన రాగం, బాలు గారు పాడిన వైనం ఎన్ని సార్లైనా మరల మరల వినాలనిపించేలా చేస్తుంది. అసలు ఈ పాత ప్రతి పెళ్లి లోను వినపడేలాగా చిరాయువు కలిగింది. అదే ఈ పాట ప్రత్యేకత. బాలు గారి గొంతులోంచి ఈ పాట వింటే ఊహ లోకం లో విహరించి పాట అయిపోతే తిరిగి రావటం చాల కష్టం అవుతుంది. అటువంటి అనుభూతి మిగిల్చిన కోటి గారు , బాలు గారు, సీతారామశాస్త్రి గారు అందరికి శత "కోటి" వందనాలు.

పాట ప్రారంభం:

 ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి
ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి

ఆకాశం అంత పందిరి భూదేవి అంత అరుగు అనటం అందరికి తెలుసు, కాని అలా అంటే సీతారామ శాస్త్రి గారెందుకు అవుతారు. మన కోసం ఆకాశంనే తీసుకు వస్తారు. అసలు అంత పెద్ద పందిరి, అంత అరుగు ఎందుకు అంటే, తెలుగు వాళ్ళ పెళ్లి అంటే అందరి సాక్షిగా జరుగుతుంది, మనకి ఎంత మంది తెలిస్తే అంత మందిని పిలిచి చేసే తతంగం. అందులో ప్రతి వాళ్ళకి పెళ్లి రోజు జీవితాంతం గుర్తుండే లాగ జరిగే ఒకే ఒక రోజు, ఒక జ్ఞాపకం. అందరి ఆశీర్వాదం తీసుకోవటం మన వాళ్ళ ప్రత్యేకత.. వధు వరులని ఆశీర్వదించటానికి వచ్చిన వాళ్ళకి మరి ఆకాశం అంత పందిరి, వెయ్యాల్సిందే. కాని పందిరి ఎలా ఉండాలి అంటే, ఆకాశం దిగి వచ్చి మబ్బులే పందిరి అవ్వాలనే సుందరమైన భావన. అలాగే అందరు చెప్పుకునేవి ముచ్చట్లు అన్నారు కాని పెళ్లి ఘనం గా జరిగింది అనలేదు సీతారామశాస్త్రి గారు. మనం పెళ్లి లో కలివిడి గా ఉంటేనే ముచట్లు ఉంటాయి. ఆ విధం గా అందరు చేసి చెప్పుకునేటట్లు ఉండాలనేదే అందరు కోరుకునేది. ఎంత అందమైన వివరణ??

చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం
ఇది వరకెరగని వరసలు కలుపుతు మురిసిన బంధుజనం
మా ఇల్ల లేత మావిళ్ళ తోరణాలన్ని పెళ్లి శుభలేఖలే 
అక్షింతలేసి ఆశీర్వదించమను  పిలుపులైనవి గాలులే
ఈ పదాల అల్లిక, వాటి కలయిక అమోఘం. ఆ పద ప్రవాహం అపురూపం. పెళ్లి అంటే ఏంటి అనేది ఇంతకన్నా అందమైన వర్ణన ఉంటుందా?? రెండు గా ఉన్న మనసులు, చెరో సగమై ఒక మనస్సై కలవమని వదు వరుల మధ్య తెర జీలకర్ర బెల్లం పెట్టిన తరువాత తీసేస్తారు, అంటే ఆ సమయం ఇద్దరు ఒకరిలో ఒకరు అయ్యే సమయం అదే పెళ్లి సమయం. ఈ పెళ్లి లో సాధారణం గా మనకి తెలియని భంధువులు కలుస్తారు, కొత్త కొత్త పరిచయాలు అవుతాయి, ఆ ఆనంద సమయం లో జరిగే హడావిడి అంతా ఇంతా కాదు అటువంటి సమయం ఎటు వంటిదంటే, అటు ఇటు తిరుగుతూ అందరు హడావిడి గా ఉంటారు. అటువంటి పెళ్లి కి పిలుపులు ఎలా ఉండాలో వివరిస్తారు వినూత్నం గా సీతారామ శాస్త్రి గారు. ఇంటికి మావిడి ఆకు తోరణాలు కట్టామంటే ఆ ఇంట్లో జరిగేది శుభ కార్యమే, మామూలు తోరణాలు కాదు లేత మావిడాకు తోరణాలు. అవి కట్టమంటే అందరికి తెలుస్తుంది, ఆ తెలియటమే శుభలేఖ. మా లేత ఆకులనుంచి వచ్చే సుగంధం గాలి లో ప్రయాణం చేసి అందరిని పలుకరిస్తుంది ఆ దారిన పోయే వాళ్ళకు ఆ చుట్టుపక్కల వాళ్ళకు, ఇంకేముంది శుభ కార్యం వచ్చి ఆశీర్వదించి అక్షింతలు వెయ్యండి అని.. ఇంత సరళమైన పదాలతో విన్యాసాలు చెయ్యటం ఆయనకే సొంతమైన విద్య.

చంపలో విరబూసే అమ్మాయి  సిగ్గు దొంతరలు 
ఆ సొంపులకు  ఎరవేసే అబ్బాయి  చూపు తొందరలు 
ఏ వరాలో ఈ జవరాలై జతపడు సమయంలో ..
వానవిల్లే వధువుగ మారి ఒదిగిన వేడుకలో 
తన  సరసను  విరిసిన  సిరిసిరి  సొగసుల  కులుకల  కలువకు  కానుకగా 
ఎద  సరసున  ఎగసిన  అలజడి  అలలే  తాకగా

అద్బుతమైన పద గారడీ చేస్తారు సిరివెన్నెల. పెళ్లి కూతురు పడే యాతన , పెళ్లి కొడుకు పడే తపన వివరిస్తారు. పెళ్లి అనగానే సిగ్గు పడే అమ్మాయి, ఆ అమ్మాయి కోసం నానా పాట్లు పడే అబ్బాయి, ఏ పెళ్లి తెర చాటున అయిన జరిగే కథ ఇది. ఎన్నో పూజలు చేసుకుంటే కాని ఇలాంటి మంచి అమ్మాయి దొరకదు అని వింటూ ఉంటాం. పూజ చేస్తే వచ్చే వరాలతో వచ్చిన ఈ అమ్మాయి, అత్యంత మనోహరమైన ఇంద్ర ధనుస్సు లాంటి అమ్మాయి వధువు గా మారి పెళ్లి పందిరి లో ఒదిగి తెర చాటున కూర్చుంటే పెళ్లి అత్యంత కమనీయం గా జరుగుతున్న శుభ ముహూర్తాన, ఆ సమయం ఎలాంటిదంటే, తన పక్కనే కులుకలతో కూర్చున్నకాలువకి కానుక ఏమి ఇవ్వటం?  తన మనసు లో ఉవ్వెత్తున ఎగసే అలజడి తప్ప? ఆ పదాలు అలా అల్లుకు పోతుంటే ఒక స్వప్న లోకం లో విహరిస్తున్నట్టు ఉంటుంది.

విన్నవారెవరసలు సన్నాయి వారి సంగతులు 
సన్న సన్నగా రుసరుసలు వియ్యాలవారి విసవిసలు 
సందు చూసి చక చక ఆడే జూద శిఖామణులూ....
పందిరంతా ఘుమ ఘుమలాడే విందు సువాసనలూ
తమ నిగనిగ నగలను పదుగురు ఎదురుగ ఇదిగిదిగో అని చూపెడుతూ 
తెగ తిరిగే తరుణుల తికమక పరుగులు చూడగా ||ఆకాశం దిగివచ్చి||
మనం సాధారణం గా పెళ్ళిళ్ళలో ఎవరు పట్టించుకోని వాళ్ళు సనాయి వాళ్ళు వాళ్ళని చూస్తూనే ఉంటాము, వాళ్ళు ఒక మూలన కూర్చొని ఏదో వాయిస్తారు కానీ వారి సంగతి పట్టించుకునే నాథుడే ఉండడు. వారు ఏమి వాయిస్తున్నారో వినేవాళ్ళు ఉండరు. ఎందుకంటే ఎవరి పనులలో వారు ఉంటారు ఎవరి గొడవలలో వాళ్ళు ఉంటారు  కాని సీతారామశాస్త్రి గారు అస్సలు ఎవర్ని అల వదిలేయరు. అందుకనే అంటారు, సన్నాయి మేళం వారిని వినేవారు ఎవరు ఉన్నారు పెళ్లి లో? అది కూడా ఎందుకంటే వియ్యాల వాళ్ళు ఏదో ఒక కారణంతో కోపంతో విస విస లాడుతూ ఉంటారు. ఇంకో పక్క మగవాళ్ళ లో చాల మంది పేక ఆటతో ఎక్కడో ఒక చోట సర్దుకు పోయి ఉంటారు. ఇంకా మిగిలింది వంటసాల, అక్కడ పెళ్లి భోజనాలతో సువాసనలతో సందడి సందడి గా ఉంటుంది. ఇంకా ఆడవారు డ్రెస్ గురించో, లేక నగల గురించో ఇదిగో చూసారా అంటూ తమ గొప్పతనం అందరికి చూపించటానికి హడావిడి గా తిరుగుతూ జరుగుతున్న సందడి గా ఉన్న పెళ్లి ఆకాశం తన మబ్బులతో దిగి వచ్చి పందిరి వెయ్యదా??

అప్పుడు బాలు గారు "చూడగా" అంటూ మరల పల్లవి లోకి వచ్చి పాట ముగిస్తే అప్పుడే అయిపోయిందా, ఈ పాటకి ఇంకో చరణం ఎందుకు రాయలేదా అనిపించటం ఖాయం విన్న నా లాంటి వాళ్ళకి. ఎందుకు ఇంకో చరణం పెట్టలేదో ఆ దర్శక నిర్మాతలకే తెలియాలి.. సీతారామశాస్త్రి గారైతే ఇంకో నాలుగు చరణాలు రాసెయ్య మన్న రాసేస్తారు, మరి పెళ్లి తతంగం ఇంతేనా ఇంకా చాల ఉంది గా, ఇక శాస్ర్తి గారు ఎంత రాస్తే అంత కోటి గారు రాగం కట్టేస్తారు,  బాలు గారు పాడేస్తారు, మనము వినేస్తాము.............

కొసమెరుపు:
ఈ పాట చిత్రీకరణ చాల వినోదం గా సందడి గా సాగుతుంది. అసలు ఈ పాట ఏ సినిమాలో అయిన సందర్భం సరిపోతుంది, కాని పాట వల్ల సినిమాకి చిరాయువు వచ్చింది, సినిమా చూడని వాళ్ళు పాట వింటే, సినిమా చూస్తె అది ఎలాగో నచ్చుతుంది కాబట్టి. ఈ సినిమా లో పెళ్లి ని ఒక వివిధమైన వివరణ ఇస్తూ కథ రాసారు సినిమా తీసారు, వాళ్ళు ఏది చేసిన మనకి ఒక అద్బుతమైన పాట ఇచ్చారు. అంటే చాలు.

Monday, January 9, 2012

song of the week - Aadi Bikshuvu

Song of the Week -  ఆది భిక్షువు వాడినేది కోరేది 

ముందు మాట : Instead of posting same matter every time, providing the link to one of the earlier posts. ( What inspired me to write this series)

Movie Name:              Siri Vennela
Producer:                   Geethakrishna Movie Creations
Director:                    K. Viswanath
Music Director:           K.V. Mahadevan/ Pugazhendi.
Singer:                      S.P. Balasubrahmanyam
Lyrics:                       Seetarama Sastry
Year of Release:         1987
ఆది భిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చేవాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
తీపి రాగాల ఆ కోకిలమ్మకు నల్లరంగునలమినవాడినేది కోరేది
కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగుకూర్చినవాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
తేనెలొలికే పూలబాలలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది
బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప దరిజేరుమన్మధుని మసిచేసినాడు ... వాడినేది కోరేది
వరగర్వమున మూడు లోకాల పీడింప తలపోయుదనుజులను కరుణించినాడు... వాడినేది అడిగేది
ముఖప్రీతి కోరేటి ఉబ్బు శంకరుడు... వాడినేది కోరేది
ముక్కంటి ముక్కోపి... ముక్కంటి ముక్కోపి తిక్కశంకరుడు  || ఆది భిక్షువు ||

ఈ పాట శివ భక్తుడైన సీతారామ శాస్త్రి గారు, తనకు అత్యంత ప్రీతి పాత్రుడైన శివుని మీద రాసిన నిందా స్తుతి. ( వ్యాజ స్తుతి)  అంటే తిడుతూనే పొగడటం అనిపిస్తుంది. లేదా స్తుతించటం కూడా negativeగా అనిపిస్తుంది. ఎంతైనా భగవంతుని మీద భక్తునికి సర్వాధికారాలు ఉంటాయి. భక్తుడికే దేవుణ్ణి తిట్టే అధికారం పొగడుకునే అధికారం అన్ని ఉంటాయి. వాళ్ళ బంధం అటువంటిది, అనుబంధం అటువంటిది.


KV మహదేవన్ గారు/పుహళేంది గారు మన తెలుగు వాళ్ళకి లభించిన గొప్ప వరం. తెలుగు భాష వాళ్ళు కాక పోయినా తెలుగు పాటకి ఎంతటి న్యాయం చేకుర్చాలో అంతంటి న్యాయం చేకూర్చిన మహానుభావులు. ఇంకా SP బాలసుబ్రహ్మణ్యం గారిని ఏమని పొగిడితే సరిపోతుంది? ఈ పాట ఎన్ని సార్లు విన్న తనివితీరని పదవిన్యాసం సీతారామ శాస్త్రి గారిదైతే, దానికి పరిమళం అద్దిన మహదేవన్ జంట, ఆ పాటని తన మధుర గానామృతంతో మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళి సాక్షాత్తు శివ సాక్షాత్కారం కలిగింప చేసిన ఆ మధుర గాయకుని గళానికి తెలుగు వాళ్ళు ఏమి ఇచ్చి ఋణం తీర్చుకోగలరు? కళ్ళు మూసుకొని ఈ పాట వింటే కలిగే అనుభూతి వర్ణనాతీతం. ఆ అనుభూతి కలుగచేసిన అందరు ధన్యులే.

పాటకి ముందు వచ్చే scenes
ఒక కళ్ళు లేని అద్బుతమైన కళాకారుని జీవిత కథ ఈ "సిరివెన్నెల" సినిమా. ఆ కళాకారుడు గాయకుడు, వేణు విద్వాంసుడు. తనకు సహజం గా వచ్చిన ఈ కళలతో అందరిని అలరిస్తు వచ్చిన డబ్బులతో  గడిపేస్తున్న "హరి ప్రసాద్" జీవితం లోకి అనుకోకుండా ఇద్దరు వనితలు ప్రవేశించి, ఆ జీవితాన్ని సిరివెన్నెల తో ఎలా నింపుతారో, కథ ఎన్ని మలపులు తిరిగి చివరికి అతని జీవితం ఏమి అవుతుందో అనేది ఈ సినిమా. ఈ సినిమాలో హరి కి కన్నులు ఉండవు, అతను కోరింది జ్యోతినే, అంటే కళ్ళు లేని అతను కోరుకునేది వెలుగునే, అంటే కళ్ళే, చివరికి ఆ జ్యోతి అతనికి వెలుగు ప్రసాదించి ఈ లోకంలోంచి నిష్క్రమిస్తుంది. పాత్రలకి పేరు పెట్టటం లో కూడా విశ్వనాధ్ గారి సూక్ష్మ ఆలోచన చాల తక్కువ మంది దర్శకుల్లో చూస్తాం.

హరి జీవితాన్ని మార్చిన జ్యోతి అంటే అతనికి ఎంతో గౌరవం. ఆ గౌరవం, అభిమానం గా మారి ఆ తరువాత  ఆరాధన గా మారి చివరికి ప్రేమగా మారుతుంది. ఆమెని పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటాడు. కాని ఆమె ఎక్కడికో ఎవరికీ తెలియకుండా తిరుగుతూ ఉంటుంది. ఎక్కడ ఉందొ కూడా హరికి తెలియదు. ఈలోగా హరి ఒక ఊరికి వెళ్తూ ఉండగా సుభాషిని అనే మూగ అమ్మాయి పరిచయం అవుతుంది. సుభాషిని మంచి చిత్రకారిణి, అలాగే శిల్పాలు కూడా చక్కగా చెక్కుతుంది. ఆ పరిచయం పెరిగి, ఆమె హరిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. జ్యోతి విషయం తెలియని ఆమె తన అన్న ద్వార హరికి ప్రేమ వ్యవహారం తెలియచేయమంటుంది. అప్పుడు హరి మనసులో ఉన్న అసలు విషయం తెలుసుకొని, హరిని, జ్యోతి ని కలపాలని దేవుడిని ప్రార్ధించటానికి దగ్గరలో ఉన్న శివాలయానికి తీసుకుని వెళ్తుంది హరిని..

పాట సందర్భం
శివాలయానికి వెళ్లి జ్యోతి పూజారి గారితో హరికి జ్యోతి తో పెళ్లి జరిగేలాగా పూజ చెయ్యమని కోరుతుంది. కాని అది సరిగ్గా అర్థం కాక సుభాషినికి, హరికి పెళ్లి జరిగేల పూజ ప్రారంబిస్తాడు ఆ పూజారి. సుభాషిణి తన మూగ భాషతో సైగలతో, మొత్తానికి తన మనసులో ఉన్న భావం హరికి తెలియచేయగలగుతుంది. తనకి జ్యోతికి పెళ్లి చెయ్యమని నేను ఇప్పుడు శివుని వేడుకోవాల అని, పాట పాడటం మొదలు పెడతాడు.

పాట ప్రారంభం 
ఆది భిక్షువు వాడినేది కోరేది,  బూడిదిచ్చేవాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది
శివుడు ఆది భిక్షువు, అన్ని వదిలేసి నిర్వికారుడుగా, నిర్వ్యమోహుడు గా ఎప్పుడు తప్పస్సు చేసుకునే దేవుడు. సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుడి లో శివునికి ఆది భిక్షువు అని పేరు. ఎందుకంటే శివుడు కాలభైరవుడు. కాలభైరవుడు నరికిన బ్రహ్మ యొక్క ఐదో తల పుర్రె తో భిక్ష మెత్తుకొని తిరుగుతూ ఉంటాడు. భిక్షమెత్తుకొనే వాళ్ళలో మొదటి వాడైన  అట్లాంటి భిక్షకుని దగ్గర మన కోరికలు ఏమి అడుగుతాము?  శివరూపం సాధారణం గా చూస్తె ఆ రూపం తో ఉన్న వాళ్ళు మనకోరికలు తీరుస్తారు అనుకోము కదా, ఒళ్ళంతా బూడిద రాసుకొని, పాము మెడకు చుట్టుకొని, స్మశానం లో నివసించే శివుని అడిగితే బూడిద తప్ప ఏమి రాలుతుంది? అంటే ఆ శరీరం నుంచి రాలేదు బూడిదే కదా, ఆ బూదిదనిచ్చే వాడినేది కోరేది? ఇది అయన రాసుకున్న పాటైన సినిమా లో ఎంత అద్బుతం గా సరిపోయింది అంటే, హరి తన జీవితంలో చీకటి నింపిన దేవుడు అంటే నిరసనే. అందుకనే మనం వెళ్తున్నది శివ ఆలయమా, మనం శివున్ని అడగాల అని ప్రతి సారి అంటాడు.

తీపి రాగాల ఆ కోకిలమ్మకు నల్లరంగునలమినవాడినేది కోరేది
కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగుకూర్చినవాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది
శివుడు సృష్టికి కారకుడు కాకపోయినా శివ భక్తులకి శివుడే సర్వస్వం. అందుకనే ఈ లోకం లో ఏది జరిగిన, దానికి కారకుడు శివుడే, ఇక్కడ సృష్టి లో లోపాలను చెప్పి ఇలాంటి తప్పులను చేసిన వాడిని ఏమి కోరగలం మనం అనే నింద కనిపిస్తుంది. నలుపు మానవుకి నప్పని, ఇష్టపడని రంగు. అది చీకటిని, భయాన్ని తెలియచేస్తుంది కనుక. అంతే కాక అది కంటికి ఇంపుగా ఉండదు కూడా. తీయగా పాడే కోకిలమ్మ కు నలుపు రంగు ప్రసాదించిన ఆ దేవుడినా నేను కోరేది? ఇక్కడ తీయటి గొంతునిచ్చి, సుందర రూపం కూడా ఇస్తే చాల బాగుండేది కదా, అటు చూడటానికి, ఇటు వినటానికి అందంగా ఉండేది,. చక్కటి గొంతునిచ్చి, రూపం సరిగ్గా ఇవ్వకుండా అన్యాయం చేసిన దేవుడిని ఏమి కోరేది?

అట్లాగే మేఘాలు చేసే శబ్దాలు భయాన్నిస్తాయి, వినసొంపు గా ఉండక భయపెడ్తాయి. మేఘ గర్జన రాత్రి కనుక వస్తే ఆ ఘర్జన ఇంకా భయంకరంగా ఉంటుంది. అటువంటి భయంకరమైన శబ్దాన్ని ఇచ్చే మేఘాల మధ్య జరిగే ఘర్షణకి  అందమైన మెరుపుని కూర్చిన వాడిని ఏమి కోరేది? ఏది సరిగ్గా చెయ్యడం రాదు ఇంకేమి అడుగుతాం? దేవుడి లీలలు సాధారణంగా అర్థం కానివి, సృష్టి రహస్యాలు అంతకన్నా అంతుపట్టనిది. కాని మానవుడు తన ప్రయత్నం తను చేస్తూనే ఉంటాడు అవి తెల్సుకోవటానికి. సీతారామ శాస్త్రి గారి భావ శక్తికి, పద సౌందర్యానికి అందరం దాసోహం కాక తప్పదు. అలాగే బ్రహ్మాండమైన జ్ఞానం, తత్త్వం, వేదాంతం కలిగి ఉన్న, సరళమైన పదాలతో లోతైన భావాల్ని తెలియచేయ గలగటం ఆయనకే సాధ్యమైంది.

తేనెలొలికే పూలబాలలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది

బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది
ఇక్కడ కూడా అదే నింద కొనసాగుతుంది, పూలు ఎంతో రమణీయంగా ఉంటాయి, చూడటానికి ఆహ్లాదంగా ఉండి తన నిండ తేనే రూపం లో తియ్యదనం నింపుకున్న పూలకి తక్కువ ఆయుష్షు నిచ్చిన దేవుడిని ఏమి కోరేది? వెయ్యటానికి చిన్న ప్రశ్నఅయిన చాల ఆలోచింప చేసే ప్రశ్న ఇది. సృష్టినే ప్రశ్నించే ప్రశ్న. పూలు, పళ్ళు, ఆకులు వీటన్నిటికి ఆయుష్షు తక్కువే. అలాగే ఈ సృష్టి లో మనకి నచ్చేవాటి జీవిత కాలం చాల తక్కువ. కాని రాళ్ళు రప్పలు లాంటి ఎక్కువ పనికి రాని, చూడటానికి అందం లేని వాటికి కలకాలం ఉండేలాగా సృష్టించిన వాడినేమి అడుగుతాం?  నాకు ఇది కావలి దేవా అని? చలనం లేక పడి ఉండే బండరాయికి జీవం ఉండదు, కాని ఆయుషు ఉంటే ప్రాణం లేకపోయినా జీవిన్చినట్టే. అటువంటి రాయికి మటుకు కలకాలం ఉండేలాగా ఆజ్ఞ ఇచ్చిన దేవుడిన మన ఇది కావలి అని అడిగేది?

గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప దరిజేరుమన్మధుని మసిచేసినాడు ... వాడినేది కోరేది
వరగర్వమున మూడు లోకాల పీడింప తలపోయుదనుజులను కరుణించినాడు... వాడినేది అడిగేది
గిరిజ అంతే పార్వతి. శివ పార్వతులని కలుపటానికి ప్రయత్నించిన మన్మధుడు ని మూడో కంటి తో భస్మం చేస్తాడు. ఇక్కడ కళ్యాణం ఎందుకన్నారో, ఆ కథ మనకి తెలియాలి. తారకాసురుడు శివుని కుమారుడి తో తప్ప చావు లేకుండా వరం పొంది ఆ వర గర్వముతో అందరిని హింసిస్తూ ఉంటాడు. తారకాసురినికి తెలుసు శివుడు అప్పటికి బ్రహ్మచారి, శివుడు విరాగి, ఇంక శివుడికి కుమారుడు కలుగడు అని. కానీ అతని కృత్యాలు మితి మీరితే, అందరు సతి దేవిని కోరితే, పార్వతి గా గిరి రాజైన హిమవంతుడి కుమార్తె గా పుట్టి, శివుని కోసం తపస్సు చేస్తుంది(అందుకే గిరి బాల అంటారు పాటలో ). కానీ శివుడు తన ధ్యానంలో తానూ మునిగి ఉంటాడు. శివుడిని పార్వతి పట్ల ఆకర్షించేది ఎట్లా? ఆ చిక్కుముడి విప్పటానికి విష్ణు కుమారుడైన మన్మధునికి ఆ పని అప్పచేప్తాడు ఇంద్రుడు. మన్మధుడు శివ దీక్షను భగ్నం చేసి పార్వతి మీద మనసు పడేలాగా మన్మధ బాణాలు వేస్తాడు, శివుని దీక్ష భగ్న అవుతుంది కాని శివునికి కోపం వచ్చి మూడో కన్ను తెరిస్తే మన్మధుడు బూడిద అవుతాడు. అప్పుడు శివుడు పార్వతిని చూసి పెళ్లి చేసుకొని కుమారుడుని కంటాడు. ఆ కుమారుడే కుమారస్వామి(కార్తికేయుడు, సుబ్రహ్మణ్య స్వామి). అతను తారకాసురిని చంపి అందరికి శాంతి చేస్తాడు.  ఇంత మంచి పని చెయ్యతలపెట్టిన మన్మధుడిని మసి చేసిన వాడినేమి కోరను తనకు తన జ్యోతిని ఇమ్మని? అంత పెద్ద కథని ఒక వాఖ్యం లో రాసేసారు సీతారామ శాస్త్రి గారు.

"దను" కుమారులు దానవులు కూడా వర గర్వము వలన ముల్లోకాలను పీడిస్తున్న వాళ్ళు అయిన వాళ్ళకి వరాలిచేస్తాడు. అంటే మంచి చేసిన వాళ్ళకు చెడు, చెడు చేసిన వాళ్ళకు మంచి చేస్తున్న దేవుడిని ఏమి కోరేది? 

ముఖప్రీతి కోరేటి ఉబ్బు శంకరుడు... వాడినేది కోరేది
ముక్కంటి ముక్కోపి... ముక్కంటి ముక్కోపి తిక్కశంకరుడు
ఇంక శివ నింద పరాకాష్ట కి చేరుతుంది, ఊరికే పొగడితే పొంగి పోయే దేవుడు శివుడు. శివ స్తుతి, తపస్సు చేస్తే వరాలిచ్చేసి అందరికి ఇబ్బంది కలుగ చేసినట్లుగా శివుని కథలు చాలానే ఉన్నాయి మనకి. వినాయక చరిత్ర గూడ అదే కదా. ముఖ ప్రీతికే  ఊరికే పొంగిపోయే దేవుడుని ఏమి ఆలోచించ కుండానే వరాలిచ్చే దేవుడిని ఏమి కోరేది? శివుని కోపం గూర్చి అందరికి తెల్సిందే, ఊరికే కోపం వచ్చే దేవుళ్ళలో మొదట ఉండే దేవుడు శివుడే. అలాగే మూడు కళ్ళు ఉన్నది కూడా శివుడే. ఎప్పుడు పొంగి పోతాడో, ఎప్పుడు ఉబ్బి తబ్బిబ్బు అయి వరాలిస్తాడో ఎవరికీ అర్థం కాదు, అందుకే శివుడిని తిక్క శంకరుడు అని ముగిస్తారు సిరివెన్నెల. శివుడు మూడో కంటిని పార్వతి కారణం గా రెండు సార్లు తెరుస్తాడు. ఒకటి మన్మధుడి మీద కోపం తో భస్మం చేస్తాడు, ఇంకోసారి దక్ష యజ్ఞం లో జరిగిన అవమానానికి. కానీ శివుడు మూడో కన్ను తెరిచేది యుగాన్ని అంతం  చెయ్యటానికే.

ఇన్ని లోపాలున్న శివుడిని ఏమి కోరతాము అన్న పాటని సందర్భానుసారం గా వాడుకుని, ఆ పాట వాడటం కోసం, సినిమా లో పాత్రల్ని, మంచి సందర్భాన్ని సృష్టించిన సినీ బ్రహ్మ K విశ్వనాధ్ గారు. అది సినిమాలో హరి పాత్ర పాడటం కూడా అంతే సమంజసం. ఎందుకంటే దేవుడి/శివుడు అతనికి అన్ని ఇచ్చి దృష్టి లేకుండా చేసిన దేవుడిని ఇలాగ ప్రశ్నించటం చాల సమంజసం.

ఈ పాట అంతులేని ఆలోచనలోకి నెట్టేస్తుంది. ఒక పాటలో ఇంత మేధో మధనం ఉంటుందా, ఎంతో భావాన్ని ఇలాగ ఒక పాటలో రాయగలగటం అనేది ఒక అద్బుతమైన వరం. ఆ వరం పొందిన సరస్వతి పుత్రుడు సీతారామ శాస్త్రి గారు.

కొసమెరుపు: 
ఈ సినిమా పాటలతో సీతారామశాస్త్రి గారు, "సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు" అయ్యారు. సినిమాల్లో అవకాశం కోసం ఈయన రాసిన కొన్ని కవిత్వాలు/పాటలు ఈ సినిమా కి చాల రోజుల ముందుగా విశ్వనాధ్ గారికి పంపిస్తే, అయన దగ్గరనుంచి ఏమి పిలిపు రాలేదు, ఆయనని కలిసిన కూడా అవకాశం ఇవ్వలేదు సరి కదా పాటలు నచినట్లు గా చెప్పలేదు. కాని ఈ సినిమా కోసం విశ్వనాద్ గారు సీతారామశాస్త్రి గారిని పిలిస్తే, అవే పాటలు మరల పంపితే చాల బాగున్నాయి అని అవకాశం ఇచ్చి మొత్తం సినిమా లోని పాటలన్నీ రాయించుకున్నారు. ఈ విషయం ఎప్పుడో ఒక ఇంటర్వ్యూ లో చదివినట్లు గుర్తు. సిరివెన్నెల సినిమా కోసం ఈ పాటని విశ్వనాధ్ గారు సీతారామ శాస్త్రి గారు ఎప్పుడో రాసుకున్నది వాడుకున్నారు, కొంచెం మార్పులతో.  సిరివెన్నెల గారు రాసి ప్రచురించిన "శివ దర్పణం" అనే పుస్తకం లో మొత్తం పాట ఉంటుంది. 

Friday, December 30, 2011

Song of the week - Kottagaa Rekkalochena - Swarnakamalam

కొత్తగా రెక్కలోచ్చెనా 
ముందు మాట : Instead of posting same matter every time, providing the link to one of the earlier posts. ( What inspired me to write this series)


ఇక ఈ వారం పాట:
కొత్తగా రెక్కలోచ్చెనా - స్వర్ణ కమలం 
Youtube Video Link for the Song
Movie       -     Swarna Kamalam
Director    -     Kasinadhuni Viswanath
Producer  -     Usha Kiron Movies
Music Director - Maestro Ilayaraja
Lyrics -             Sirivennela Seetarama Sastry
Singer (s)          - S.P.Balasubrahmanyam and S. Janaki

Song Lyrics
కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వపిల్లకీ 
మెత్తగా రేకు విచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా
కొమ్మచాటువున్న కన్నెమల్లెకి కొమ్మచాటువున్న కన్నెమల్లెకి
కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా

కొండదారి మార్చింది కొంటె వాగు జోరు
కులుకులెన్నో నేర్చింది కలికి యేటి నీరు  
(2) 
బండరాళ్ళ హోరుమారి పంటచేల పాటలూరి  (2)
మేఘాల రాగాల మాగాని వూగెలా సిరిచిందు లేసింది కనువిందు చేసింది  
|| కొత్తగా || 

వెదురులోకి వొదిగింది కుదురులేని గాలి
ఎదురులేక యెదిగింది మధురగాన కేలి 
 (2) 
భాషలోన రాయలేని రాసలీల రేయిలోని 
 
అబ్బ... భాషలోన రాయలేని రాసలీల రేయిలోని
యమునా తరంగాల కమనీయ శ్రుంగార కళలెన్నో చూపింది కలలెన్నో రేపింది 
|| కొత్తగా || 

పాటకి ముందు వచ్చే scenes
విశ్వనాద్ గారి సినిమాలలో చాల వాటిల్లో సూక్ష్మంగా ఒక సందేశం ఉంటుంది, అదేమిటంటే మనసు పెట్టి ఏదైనా కళని ఆరాధిస్తే, అనుభవించి ఆ కళలో అంతర్లీనమిత మనిషికి వచ్చే ఆనందం వర్ణనాతీతం. అదే మాట అయన సినిమాల్లో అనేక పాత్రల చేత చెప్పిస్తారు.  ఈ సినిమా ఒక అత్యద్బుతమైన కళా సంపద, ప్రక్రుతి ప్రసాదించిన అందం, ఉన్న ఒక అమ్మాయి తన తండ్రి ప్రసాదించిన విద్యని తృణీకరించి, ఆ విద్య గొప్పతనం తెలియక వేరే ఆనందాల కోసం వెంపర్లాడితే, కళ విలువ తెలిసి, ఆ అమ్మాయి విద్య, గొప్పతనం తెల్సిన కథానాయకుడు, ఆ అమ్మాయికి నాట్యం విలువ, తద్వారా వచ్చే ఆత్మానందాన్నితెలియచేసి ఆ అమ్మాయిని సరియిన దారిలో పెట్టి, ఆ అమ్మాయిని స్వర్ణ కమలంగా మార్చిన కథ ఇది.

ఈ సినిమాలో అనేక సన్నివేశాలు కొన్ని హాస్యం కలుగ చేస్తే, ఇంకొన్ని మనల్ని అందులో involve అయ్యేటట్టు చేస్తాయి. కొన్ని హృద్యంగా ఉండి ఎక్కడో బలం గా తాకుతాయి. అందులో ఒకటి, త్యాగరాజ జయంతి నాడు హీరోయిన్ తండ్రి జట్కా బండి లో వెళ్తుంటే మిగితా ప్రపంచం అంతా అత్యంత వేగంగా వెళ్తుంటే హీరోయిన్ అనే మాట ఈ సినిమాలో హీరోయిన్ ఆలోచన విధానం ఏమిటో తెలియచేస్తుంది. కళల పట్ల తగ్గుతున్న ఆదరణ, ప్రస్తుత పరిస్తితుల్ని గురించి హెచ్చరిస్తుంది.
పాట సందర్భం 
హీరోయిన్ చేత బలవంతం గా నాట్య ప్రదర్సన చేయిస్తే, ఆమె చేసిన మూర్ఖత్వం వల్ల తండ్రిని కోల్పోతుంది, ఐన ఆమె మారదు. చివరికి ఆమె కోరుకున్నట్లే ఒక హోటల్ లో ఉద్యోగం ఇప్పిస్తాడు హీరో. అక్కడ అనుకోని పరిస్తితుల్లో నాట్యం చెయ్యాల్సి వస్తుంది. ఆ నాట్యం నచ్చక నాట్య కళ అభ్యసిస్తున్న ఒక విదేశి వనిత లేచి వెళ్ళిపోతుంది. ఆ తరువాత హీరో ని పిలిచి నాట్యం లో తప్పొప్పుల్ని తెలియచేస్తుంది. అంతే కాక ఒక నెలలో మరల వస్తాను, ఈ సారి సరిగ్గా ప్రదర్సన ఇస్తే అమెరికా తీసుకు వెళ్తాను అని ఇద్దరికీ చెప్తుంది. ఆ మాటలు విన్న హీరోయిన్ ఇంటికి వెళ్లి, తన అక్క, స్నేహితురాలు, హీరో, ఇలాగ అందరి మాటలు గుర్తుకు తెచుకొని ఆలోచలనలో పడి మనసు మార్చుకొని గజ్జెలు సంచి లో వేసుకొని సముద్రం ఒడ్డున నాట్య సాధన( విశ్వనాద్ గారు ప్రకృతికి చెందిన కళ ప్రక్రుతి తోనే ఎక్కువ సార్లు చూపిస్తారు తన సినిమాలలో, గానం చేసిన కాని, నాట్యం చేసిన కాని, బొమ్మ గీసిన గాని. ) మొదలు పెడ్తుండగా ఒక మూల నుంచి అద్బుతమైన గొంతు పాట పాడటం విని ఆగిపోయి, ఆశ్చర్యపోయి అటు వైపు చూస్తుంది.


పాట ప్రారంభం 
బాలసుబ్రహ్మణ్యం గారు ఈ పాట ఆలాపన చేసిన తీరు అత్యంత మధురం గా ఉంటుంది, అలాగే అమృతం లాగ ఉంటుంది అయన గొంతు వింటే, అయన పాటని అద్బుతం గా అరంబించిన అనేక పాటల్లో, "వేవేల వర్ణాల" ( సంకీర్తన ), "కీరవాణి" ( అన్వేషణ ),  "చైత్రము కుసుమాంజలి" (ఆనంద భైరవి) ఇలాగ ఎన్నో ఎన్నెన్నో.

ఇళయరాజా , బాలసుబ్రహ్మణ్యం వీరి  బంధం ఎన్నెన్ని జన్మలదో కాని, వారిద్దరూ సమకాలీనులు కావటం, వారిద్దరి సంగీతం వినగలగటం మనం చేసుకున్న పూర్వ జన్మ సుకృతం. ఇంక జానకి గారి భావప్రకటన గురించి ఏమని వర్ణించ గలం?  


ఇంకా పాటలోకి వెళ్తే
కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వపిల్లకీ 

ఈ పాటలో చాల ప్రయోగాలు సిరివెన్నెల చేసారు. అసలు పాట ప్రారంభమే అమోఘం. గువ్వ పిల్లకి కొత్తగా రెక్కలు రావటము అనే పద ప్రయోగంలో సినిమా మొత్తం చెప్పేసినట్టు ఉంటుంది. పక్షికి సహజంగా  రెక్కలు ఉంటాయి, ఆ పక్షి వాటితో ఎగురుతుంది, అది దాని లక్షణం. కాని ఆ పక్షి ఎగురకపోతే ఆ రెక్కలు ఉన్న లేనట్టే కదా. అలాగే హీరోయిన్ కి సహజంగా నాట్య కళ లభిస్తుంది, కాని ఆ కళని సంపన్నం చేసుకోలేదు, సార్థకత తీసుకు రాలేదు. ఇప్పుడు జరిగిన అనేక సంఘటనల ప్రభావమో కానీ, వచ్చిన  సదవకాశం ఉపయోగించుకొని అమెరికాకి ఎగిరి వెళ్ళాలనే తపన కాని,  ఏదైనా కారణం వల్ల కాని ఇప్పుడు ఆమె తనంతట తాను నాట్య సాధన కోసం గజ్జెలు తీసుకొని బయలు దేరిందంటే పక్షికి ఎగరటానికి రెక్కలు వచినట్లే ఇక్కడ హీరోయిన్ కి కూడా ఎగురటానికి రెక్కలు వచ్చినట్లే. రెక్కలు కొత్తగా రావటం అంటే, ఉన్న రెక్కలకి కొత్త శక్తి వచినట్లే. 

మెత్తగా రేకు విచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా 
కొమ్మచాటువున్న కన్నెమల్లెకి కొమ్మచాటువున్న కన్నెమల్లెకి 

మల్లె రేకులు నెమ్మదిగా విచ్చుకుంటే , ఒక్కొక్క రేకు పరిమళం వెదజల్లుతుంది. ఆ మల్లె కొమ్మ చాటున ఉన్న లేక పోయిన పరిమళం ఇస్తుంది. కాని కొమ్మ చాటున ఉన్న మల్లెకి అందులో కన్నె మల్లెకి అంటే వాడని పువ్వుల పరిమళం అని ఎందుకన్నారంటే, హీరోయిన్ ఇప్పటివరకు నాట్య కళని కొమ్మ చాటున అంటే ఇంటి పట్టునే తనలోనే దాచుకుంది, మంకు పట్టు పట్టి ముడుచుకుని కళ యొక్క పరిమళాన్ని తనలోనే దాచేసుకుంది. అటువంటిది, ఇప్పుడు తనకు తానె రెక్కలు విచ్చుకొని నాట్య సాధనకు వస్తే వచ్చేది పరిమళమే, నటనాభినయ సుగంధమే.

ఇదే విశ్వనాధ్ గారు సంభాషణ రూపం లో చెప్పిస్తారు. పాట గొప్పతనం అందరికి అర్థం అయ్యేలా చెప్పటానికి.
హీరోయిన్: గూళ్ళు ఏమిటి, గువ్వలేమిటి కొత్తగా రెక్కలు  రావటమేమిటి? ఏమిటండి ?
హీరో: మీరు మనస్పూర్తిగా ఆ గజ్జెలు కాళ్ళకు కట్టుకున్టున్నారంటే గువ్వపిల్లకి  కొత్తగా రెక్కలోచినట్లే కదండి!!
హీరోయిన్: మీకు కవిత్వం కూడా వచ్చా?
హీరో: మీ  కాళ్ళని చూస్తుంటేనే కవిత్వం వచేస్తుంది (ఇక్కడ హీరోయిన్ కళ్ళు తిప్పటం ఆమె కళ్ళకున్న అందాన్ని, ఆ కళ్ళల్లో చిలిపితనం, కొంటెతనం  చూపించటానికేనేమో!!!)
మీరు గంధం చెక్కలాంటి వారు, నేనేమో రాయిలాంటి వాణ్ణి మంచి గంధం తీయాలంటే ఏమి చేస్తారు? రాయి మీద ఆరగ తీస్తారు ఇప్పుడు మీరు సాధన చెయ్యటానికి వచ్చారు  కదా, ఈ  రాతిని ఉపయోగించుకోండి, మీ అభినయం సుగంధాలు విరజిమ్ముతుంది


ఇళయరాజా గారి స్వర కల్పన నిజం గానే పక్షి ఎగురుతున్నంత భావం కలిగిస్తారు తన స్వరాలతో. పదాలకి న్యాయమే కాదు, సన్నివేశానికి ఇదే సరి ఐన పాట గా తన ముద్ర వేస్తారు.

చరణం 1
కొండదారి మార్చింది కొంటె వాగు జోరు
కులుకులెన్నో నేర్చింది కలికి యేటి నీరు  
 (2) 
బండరాళ్ళ హోరుమారి పంటచేల పాటలూరి  (2)
మేఘాల రాగాల మాగాని వూగెలా సిరిచిందు లేసింది కనువిందు చేసింది


జోరు మీద ఉన్న వాగు గమనం చూస్తే ఎవరికైనా ఒక అద్బుతమైన అనుభూతి కలుగుతుంది. దారిలో వచ్చే అడ్డంకుల్ని దాటుకుంటూ, పరవళ్ళు తొక్కి ప్రవహిస్తుంటే, ఆ వంకర టింకర ప్రవాహంలో ఆ వాగు చేసే కులుకులు చూడవలసిందే. నది వాగ లా మారి అలాగ శబ్దం చేస్తూ ప్రవహిస్తుంటే, ఆ వాగు నీటికి పంటలు పచ్చగా పెరిగి ఊగుతుంటే, ఆ పచ్చదనం చూసిన వాళ్ళకి కనువిందే కదా. పంటలు పెరిగితే ఇంట్లో లక్ష్మి కళకళ లాడుతుంది.  మేఘాల రాగం మల్ల ఈ పాట లో కూడా వాడారు సిరివెన్నెల గారు.  హీరోయిన్ చేసే నాట్యాన్ని ఇలాగ ఒక వర్ణన అద్భుతమైన ప్రయోగం. వాగు జోరు మీద ప్రవహిస్తే వచ్చే ఫలితం, ఆమె నాట్యం చేస్తే వచ్చే ఫలితం కూడా ఒక్కటే, అందరికి కనువిందు కలగటం. అది ఎంత చక్కగా వివరించారో?

విశ్వనాద్ గారు గజ్జెలకి చాల ప్రాధాన్యతని ఇస్తారు. సప్తపది లో కాళ్ళ పట్టీలకి నది జలంతో అభిషేకిస్తే, ఇక్కడ గజ్జేలని నదిలో కడిగించి హీరో చేత కాళ్ళకి కట్టిస్తారు. 

చరణం 2
వెదురులోకి వొదిగింది కుదురులేని గాలి
ఎదురులేక యెదిగింది మధురగాన కేలి 
  (2) 
భాషలోన రాయలేని రాసలీల రేయిలోని 
  
అబ్బ... భాషలోన రాయలేని రాసలీల రేయిలోని
యమునా తరంగాల కమనీయ శ్రుంగార కళలెన్నో చూపింది కలలెన్నో రేపింది 



ఇన్నాళ్ళు కుదురులేకుండా అటు ఇటు తిరుగుతున్న హీరోయిన్, ఇప్పుడు నాట్య సాధనకు కుదురుకుంది. ఆ పర్యవసానం ఎట్లా ఉంటుంది అంటే ఎలా చెప్పాలి? మళ్ళ ఇక్కడ వేణువునే వాడుకున్నారు. గాలి వెదురులోకి దూరితే వచ్చేది మధుర గానమే. ఆ రాగనుభూతి భాషకి అందని భావమే. ఇంతటి తో ఆగకుండా, హీరో/హీరోయిన్ ల మధ్య జరిగే భావాల్ని కూడా చెప్తారు. వాళ్ళలో రేగే ఆలోచనల ప్రతి రూపమే ఆ ముగింపు. హీరో మొదట గజ్జె కట్టి నాట్యం అభినయిస్తే, దాన్ని హీరోయిన్ సరిదిద్దుతుంది, ఆ సీన్ ఇక్కడ అక్కడ కంటే ఇక్కడ బాగుండేదేమో. లేకపోతె నన్ను ఉపయోగించు కొండి అన్న దానికి ముందు పెట్టారేమో, అతనిని సరిదిద్దుతూ తన నాట్య సాధనలోకి వెళ్ళిపోతుంది.


ఈ పాట సెలయేరు ప్రవాహం లాగ, కొంటె వాగు జోరు లాగ సాగుతుంది అనిపిస్తుంది, ఆ పద ప్రయోగం చూస్తే.  గాలి-కేళి,  జోరు-నీరు వెదురు-ఎదురు, ఒదిగింది-  ఎదిగింది,  మార్చింది- నేర్చింది, వాగు - యేరు ఈ పదాలు వింటుంటే ఇలాంటి పాటలు మరల రావేమో అనిపిస్తుంది. ఒక్కోసారి తెలుగు పాటా నీ ఆయుష్షు తీరిందా అని అడగాలనిపిస్తుంది .


ఆ ప్రశ్నవివరాలతో మరల వచ్చే వారం కలుద్దాం.

Tuesday, December 27, 2011

Song of the week - Nee prasnalu neeve - Kotta Bangaru lokam

Song of the week: Nee prasnalu neeve 
Movie -            కొత్త బంగారు లోకం
Director -          శ్రీకాంత్ అడ్డాల
Production -     దిల్ రాజు 
Music Director - Mickey J Meyer
Lyrics -             Sirivennela SeetaRama Sastry
Singer -            S. P. Balasubrahmanyam


ఈ పాట నేను కొన్ని వందల సార్లు విని ఉంటాను, విన్నప్పుడల్లా అర్థం ఇది కాదేమో, పాట అర్థంతో మనసు సంతృప్తి చెందలేదు ఇంకో సారి వినాలి అనిపించేది. ఒక్కోసారి ఈ  పాట, ఇందులో ఇంత అర్థం ఉందా అని ఆశ్చర్య పరిచేది. ఈ పాట సిరివెన్నెల గారు సినిమా కోసం రాసారో లేక అంతకు ముందు రాసుకున్న పాటని సినిమా కోసం మార్చి వాడుకున్నారో?  నాకు రెండో చరణం తప్ప మిగితా పాట జీవితాన్ని చదివేసి అది వివరించే తపన లాగా కనిపిస్తుంది. ఈ పాట రాసిన సిరివెన్నెల గారు ఎంత దన్యులో ఈ పాట వినగలిన మన లాంటి వారెందరో కూడా అంత ధన్యులే. ఇంత చిన్న పాటలో అనంతమైన అర్థం చెప్పిన సిరివెన్నెల గారికి సహస్ర కోటి పాదాభి వందనాలు. 

బాలు గారు పాడినట్టుగా ఈ పాట  ఇంక ఎవ్వరు పాడలేరు, ఇది ఎవరు కాదనలేని సత్యం. మంచి గళం, అత్యద్బుతమైన పాట ఉంటె, దానికి ప్రాణం దానంతట అదే వస్తుందేమో. మిక్కీ జే మెయెర్ ఈ పాటకి స్వర కల్పన చెయ్యగలగటం ఆయనకి అయాచితం గా వచ్చిన వరం. ఆ వరాన్ని సద్వినియోగ పరచుకోవటం ఆయన పూర్వ జన్మ సుకృతం.


పాటకి ముందు వచ్చే scenes
ఈ పాటకి ముందు వచ్చే scenes లో ఒకటి హీరోయిన్ ఫోన్ లో మాట్లాడుతూ పారిపోదాము అని హీరో ని కోరుతుంది, రైల్వే స్టేషన్ లో 4:00 కి వెయిట్ చేస్తా వచ్చెయ్యి  అంటూ టైం fix చేస్తుంది , ఇంక ఇల్లు వొదిలి శాశ్వతంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. అదే నిర్ణయం అమలు చెయ్యటానికి ఇద్దరు సమ్మతమవుతారు, కాని ఇద్దరి లో కొన్ని వేల ప్రశ్నలు, బిడియం, భయం ఆందోళన మొదలువుతుంది.  


హీరోయిన్ ఫోన్ లో మాట్లాడి ముగించగానే, అప్పుడు ఆ సందర్భం లో dialogs అద్బుతం గా ఉంటాయి, "మన గదిలో లైట్ తీసేసే ముందు పక్క గదిలో లైట్ ఉందొ లేదో చూసుకోవటం తెలియదు కాని ఒక్కదానివి వెళ్లి ఆ కుర్రోడి కోసం వెయిట్తో చేద్దామనుకున్నావే?? పాపం మీ నాన్న నీ మనసుకే కాపలా కాయాలి అని అనుకుంటున్నాడు. మీ నాన్న చేసే అతి జాగ్రత్త వలన నువ్వెక్కడ నీ చిన్ని చిన్ని ఆనందాలని కోల్పోతావేమో అని నిన్ను హాస్టల్లో జాయిన్ చేయిస్తే, ఆ రోజు అది రైట్ అనుకున్నాను అది తప్పు అయిపొయింది. ఇవ్వాళ శాశ్వతంగా నువ్వు నీ ఆనందం కోల్పోతావని బయటకి వెళ్లి పోదామనుకున్నావు చూడు, నువ్వు రైట్ కావొచ్చు ఎందుకంటే, ఇవ్వాళ రైట్ అనుకున్నది రేపు తప్పు కావొచ్చు, ఇవ్వాళ తప్పు అనుకున్నది రేపు రైట్ అవుతుంది."


ఇంక ప్రకాష్ రాజ్ కి హీరో ప్రేమ వ్యవహారం తెలుస్తుంది, అప్పుడు హీరో స్నేహితురాలి తో అన్నdialogs చాల   ఆలోచింపచేస్తాయి. "ఇన్ని ఆలోచనలు మనసులో పెట్టుకొని ఎగ్జామ్స్ వాడు ఏమి రాసి ఉంటాడు? వాళ్ళ అమ్మ వాడి గురుంచి ఎన్ని కలలు కంది? వాడి చిన్నప్పుడు నేను కాల్చి పారేసిన cigarette వాడు కలిస్తే వాడిని కొట్టలేదమ్మ, నేనే cigarette మానేసాను.  ఎందుకంటే పిల్లల్ని భయం తో కాకుండా ప్రేమతో పెంచాలనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థం అవుతోంది, ప్రేమ తో పెంచిన భయం తో పెంచిన మీ హృదయాలని control చెయ్యలేము అని. ఇప్పుడు తిట్టాల? కొట్టాల ? ఇవేవి ది నాకు అందరిలాగా తెలియని పని, నాకు తెలిసినదల్ల ప్రేమించడమే, ఇంకా ప్రేమిస్తాను అప్పుడైనా వాడు తెలుసుకుంటాడో  లేదో? "".


ఇంకో పక్క హీరోకి అలజడి మొదలు అవుతుంది, తన ఆలోచనలో తను ఉంటాడు, ఇంకో పక్క తండ్రి ఒక్క మాట కూడా అనడు, కానీ తండ్రిని చూస్తే ఏదో అలజడి. చెప్పాలని ఉన్న చెప్పలేని నిస్సహాయత, తండ్రి ఎగ్జామ్స్ పాస్ అవ్వాలని వాచ్ ఇస్తే, పరీక్షలు సరిగ్గా రాయలేదని వాచ్ తిరిగి ఇచ్చేయ్యలనుకుంటాడు, అప్పుడు హీరో, ప్రకాష్ రాజ్ మధ్య dialogs కూడా చాల బాగుంటాయి. తల్లి తండ్రులకి బిడ్డలు పాస్ అయిన ఫెయిల్ అయిన పిల్లలు పిల్లలే. అటువంటి వాళ్ళని వదిలేసి పిల్లలు ఎక్కడికో వెళ్లి ఏమి చేద్దామనో?

తండ్రిని స్టేషన్లో దింపి హీరో తన ప్రేమ ప్రయాణం గురించి ఆలోచిస్తూ నడుస్తుంటే వచ్చే పాట ఇది.,.


||ప|| |అతడు|
       నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా
       నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా
       ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా
       ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా
       పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
       అపుడో ఇపుడో కననే కనను అంటుందా
       ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా
       గుడికో జడకో సాగనంపక ఉంటుందా
       బతుకుంటే బడి చదువా అనుకుంటే అతి సులువా
       పొరబడినా పడినా జాలిపడదే కాలం మనలాగా
       ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా


||చ|| |అతడు|
       అలలుండని కడలేదని అడిగేందుకె తెలివుందా
       కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా
       గతముందని గమనించని నడిరేయికి రేపుందా
       గతి తోచని గమనానికి గమ్యం అంటూ ఉందా
       వలపేదో వల వేసింది వయసేమో అటు తోస్తుంది
       గెలుపంటే ఏదో ఇంత వరకు వివరించే ఋజువేముంది
       సుడిలో పడు ప్రతి నావ చెబుతున్నది వినలేదా
.
||చ|| |అతడు|       

       పొరబాటున చేజారిన తరుణం తిరిగొస్తుందా
       ప్రతి పూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా
       మన కోసమే తనలో తను రగిలే రవి తపనంతా

       కనుమూసిన తరువాతనే పెను చీకటి చెబుతుందా
       కడ తేరని పయనాలెన్ని పడదోసిన ప్రణయాలెన్ని
       అని తిరగేశాయా చరిత పుటలు వెనుజూడక ఉరికే వెతలు
       తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు
       ఇది కాదే విధి రాత అనుకోదేం ఎదురీత   || పది నెలలు || 



సాధారణం గా ప్రేమికులకి జీవితం లో చాల విషయాలు ఎలా చెయ్యాలో కూడా తెలియదు కాని, ఒకరి కోసం ఒకరు ఏది చేసుకొవటానికైన సిద్ధపడతారు. ప్రేమ కోసం, లేదా ప్రేమించివాళ్ళు కోల్పోతారు ఏమో అన్న భయమో ఏదో తెలియదు కాని, అందరిని మోసగించి, ఒకరిని ఒకరు పొందేవరకు, తమల్ని తాము మోసగించుకుంటూ బ్రతుకుతారు. ఆ సమయం లో చాల మందికి విజ్ఞత ఉండదు, సరి ఐన ఆలోచన ఉండదు, ఎంత సేపు తమ జీవితం ముఖ్యం, ఇంకేమి అక్కర్లేదు అన్నట్టు ఉంటారు.  ఆ ప్రేమకి  అడ్డు వచ్చిన వాళ్ళని శత్రువులు గా చూస్తారు. 



చాల మందికి బ్రతకటం కూడా రాదు కానీ ఒకరికోసం చావటానికి సిద్దపడతారు, ప్రేమించిన వారి కోసం తమల్ని ప్రేమించిన తల్లి తండ్రులను, స్నేహితులను వాళ్ళని కోల్పోవటానికి కూడా సిధపడతారు. కొంతమంది అడుగడున వాళ్ళు చేసేది తప్పో ఒప్పో అన్న సందేహాలతో సతమతమవుతుంటారు, వాళ్ళు తమముందు ఉన్న ప్రేమకోసం ఆలోచిస్తారు కాని దానికంటే పెద్దదైన జీవితం గురించి ఆలోచించరు. అటువంటి వాళ్ళకి ఒక హెచ్చరిక లాగ ఉంటుంది ఈ పాట. వాళ్ళని ప్రశ్నిస్తున్నట్టు కూడా ఉంటుంది.

అంతే కాకుండా, ప్రేమించే తల్లి తండ్రులని వదిలేసి తమ గమ్యం నిర్దేసిన్చుకున్న వాళ్ళకి జీవితం గురించి అర్థం 
అయ్యే లాగ చెప్తూ, మీరు వేసే ప్రతి అడుగు మీదే, దాని ఫలితం కూడా మీదే అనే మరో హెచ్చరిక కూడా ఉంటుంది ఈ పాటలో. 

అలాగే కాలం యొక్క మహిమ కూడా చెప్తారు, కాలం ఎవ్వరికోసం ఆగదు, ఒకరు గెల్చిన ఓడిన, కాలం పరిగెడుతూనే ఉంటుంది, మన వేసే తప్పటడుగులు సరిదిద్దుకోవటం కోసం మనకి కాలం సమయం ఇవ్వదు అందుకని మన జాగ్రత్త లో మనం ఉండాలి అనే మరో హెచ్చరిక కూడా ఇస్తారు సిరివెన్నెల,. 

అలాగే, మీ ప్రేమ సఫలం కావొచ్చు లేక విఫలం కావొచ్చు, మీరు వేసే ప్రతి అడుగు, మీ జీవితం ముందు తరాలకి ఒక ఉదాహరణ కావొచ్చు కాక పోవొచ్చు, దానికి మీరే భాద్యులు అన్న మరో హెచ్చరిక.

ఇక్కడ సిరివెన్నెల గారు ప్రేమ గురించి విశ్లేషణ చెయ్యలేదు, అది మంచిదో చెడ్డదో అన్న వివరణ కూడా ఇవ్వలేదు, కాని ఆ ప్రయాణం చేస్తున్న వాళ్ళకి అడుగడుగునా వివరిస్తారు, ఆ దరి ఎలా ఉంటుందో అని. 

అందుకనేనేమో సినిమా లో హీరో తన తండ్రిని అడ్డ దారిలో రైల్వే స్టేషన్ కి తీసుకెళ్తుంటే జాగ్రత్త రా చూసుకొని వెళ్ళు అనటం చూపిస్తారు తండ్రి ఆ దారిలో ఆటంకాలు సరియిన దారి కాదు అనే హెచ్చరిక లో వివరిస్తారు. 

ఇంక పాట లోకి వస్తే 

నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా, నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా

ఈ పాటకి ముందు  జరుగుతున్న సందర్భాల్ని చూస్తే, హీరో మానసిక సంఘర్షణ తెలుస్తుంది. తను చేస్తున్నది తప్పా లేక ఒప్పా అనే సమస్య తో కొట్టు మిట్టాడుతూ ఉంటాడు, సాధారణం గా చూసిన కూడా ఈ వాఖ్యం అంతులేని అర్థం కలది. మనం ఈ జీవితం లో ఒంటరిగా వస్తాం, ఒంటరి గా వెళ్ళిపోతాం. అడుగడుగునా మనకి ప్రతి సారి అనేక ధర్మ సంకటాలు కల్గుతాయి, అనేక సార్లు మనం ఒక నిర్ణయం తీసుకొని వెళ్తూ ఉండాలి ఈ జీవిత గమ్యం లో, మన కష్టాలు వేరే వాళ్ళు తీసుకోరు, మన చిక్కులు వేరే వాళ్ళు విడతీయారు. ఇది మనం మన కాళ్ళ మీద నిలబడ్డ తరువాత, తల్లి తండ్రులు మనల్ని రక్షిస్తున్నంత కాలం మనకి అన్ని వల్లే చేస్తారు, కానీ వాళ్ళని కాదనుకున్నాక కాని మనం రెక్కలోచి ఎగిరిపోయిన కాని మన జీవితం మనదే. ఇంత పెద్ద వేదాంతం, ఒక చిన్న వాఖ్యం తో మొదలు పెడతారు సిరివెన్నెల,. అలాగే సినిమాలో హీరో, హీరోయిన్ డిసైడ్ చేసుకుంటారు ఇల్లు విడిచి వెళ్లి పోవాలి అని, వాళ్ళకి ముందు గా ఒక హెచ్చరిక చూసారా ఇంకా మీ ప్రశ్నలు, మీ చిక్కు ముడులు మీవే, మీరు మీరు సృష్టించుకున్న వన్ని మీవే. ఇన్నాళ్ళు మిమ్మల్ని ప్రేమించి కాపాడిన తల్లి తండ్రులు మీకు ఉండరు అన్న సందేశం కూడా ఉందేమో,,

ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా

గాలి తరమటం అంటే వయసు తరమటమే, అల్లరి వయస్సు తొందరపడి తరుముతుంది, ఏదో చేసెయ్యమని ఒకరిని ఒకరు కలసుకోమని, ఇప్పుడు ఏమి చెయ్యాలో తెలియదు అంటే కుదరదు గా, అంటే కలిసి పారిపోడం అని డిసైడ్ చేసిన తరువాత మళ్ళ దాని గురించి అలోచించి ఏమి చెయ్యాలో తెలియదంటే చెల్లదుగా అని భావం


పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా, అపుడో ఇపుడో కననే కనను అంటుందా
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా, గుడికో జడకో సాగనంపక ఉంటుందా

ఇక్కడ సిరివెన్నెల గారి పదజాలం సమ్మోహనం. ప్రకృతిని వాటి ధర్మాన్ని అత్యాద్బుతం గా వివరిస్తారు, అల వివరిస్తూనే గొప్ప సందేశం ఇస్తారు, ఈ ప్రేమికులు పారిపోవటానికి సిద్దపడితే అది ఎందుకు తొందరపడతారు, మీ వయసు ఎంత? అని ప్రశ్నిస్తున్నట్టు ఉంటుంది. ( సినిమా లో హీరో హీరోయిన్, under graduates కూడా కాదు , మైనారిటీ కూడా తీరదు ). అమ్మ పది నెలలు మోస్తుంది బిడ్డని ఒక్కోసారి. అంటే పూర్ణ గర్భిని బిడ్డని మోసే సమయాన్ని తొమ్మిది అనకుండా పది అంటారు సిరివెన్నెల. ఇక్కడే అయన ఆలోచన శక్తి మనకు తెలుస్తుంది. అన్ని నెలలు మోస్తున్న కదా నేను బిడ్డను కనను దాచేసుకుంటాను అని అనదు కదా, బిడ్డని కనే తీరుతుంది, అది ప్రక్రుతి ధర్మం. అలాగే, కొమ్మకి పూలు పూస్తాయి, వాటిని కూడా కొమ్మదాచేసుకుంటాను అని అనదు కదా. పూలు మనకి సాధారణం గా గుడి కో, ఎవరి జడలోకో వెళ్తాయి, అంటే అమ్మాయిని కూడా అలాగే అత్తవారింటికి పంపకుండా తల్లి తండ్రులు ఆగిపోరు కదా, మీకు ఎందుకు తొందర అనే ప్రశ్న ఉంటుంది. మీరు నిర్ణయం తీసుకునేంత తొందర ఎందుకు వచ్చింది?


బతుకుంటే బడి చదువా అనుకుంటే అతి సులువా
పొరబడినా పడినా జాలిపడదే కాలం మనలాగా
ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా

ఇక్కడ కొంచెం బోధిస్తున్నట్టు ఉంటుంది పాటలో. బడి చదువంటే, ఎంతో కొంత చదవటం, చదివింది పరీక్షలాగ  రాయటం పాస్ అవ్వటం. సాదారణం గా కొంచెం ప్రయత్నం చేస్తే అందరు పాస్ అవుతారు. ప్రతి సంవత్సరం పాట్య అంశాలు ఉంటాయి, అది చదివి పాస్ అవ్వటమే బడి చదువు. ఇక్కడ నాయిక నాయికలు ఇంకా బడి చదువే కాబట్టి దానితో పోల్చారేమో. కానీ జీవితం ఎప్పుడు ఏ పరీక్షా పెడ్తుందో తెలియదు, జీవితం బడి చదువంటే తేలిక కాదు, అలాగా అనుకొంటే పొరపడినట్టే అని హెచ్చరించినట్టు. అసలు జీవితం అంటే ఏంటి అనుకోని మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు అని అడుగుతున్నట్టు కూడా అనుకోవచ్చు. ఇంక కొంచెం ముందుకి వెళ్లి కాలం యొక్క విలువని , జీవితం యొక్క విలువని చెప్పటం జరుగుతుంది. ఒక తప్పటడుగు చాలు జీవితం లో చాల కోల్పోవటానికి, మనం ఏమి చేసిన కాలం ఆగదు, చేసే పొరపాట్లని దిద్దుకోవటానికి అవకాశం ఇవ్వదు, ఎందుకంటే మనం చేసిన తప్పులు మనం వేసే తప్పటడుగులు దిద్దుకొని మళ్ళ జీవితం మొదలు పెట్టేదాకా ఒక్క నిమిషం కూడా ఆగదు. అంటే ఆలోచనలేని ఒక్క అడుగు వేసిన జీవితాంతం అనుభవించాల్సిందే, ఎందుకంటే కాలానికి జాలి ఉండదు. అంత పెద్ద నిర్ణయం అంత సులువుగా తీసేసుకున్నారు, జాగ్రత్త అనే హెచ్చరిక కనిపిస్తుంది. సినిమాలో అందుకనే వాచ్ హీరో కి ఇవ్వటం, దాని విలువ తెల్సుకోలేకపోయాను అని తిరిగి ఇచ్చెయ్యటం తరువాత అది హీరో పెట్టుకొని ప్రయాణం గమ్యం మార్చుకోవటం ఇవ్వన్ని తెల్సుకున్నతరువతనేమో.


అలలుండని కడలేదని అడిగేందుకె తెలివుందా
కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా
గతముందని గమనించని నడిరేయికి రేపుందా
గతి తోచని గమనానికి గమ్యం అంటూ ఉందా


ఇంక మరల ప్రశ్నలకి వచ్చేస్తారు సిరివెన్నెల, సముద్రం అలలకి ఉన్న సంబంధం అందరికి తెల్సిందే, సముద్రానికి అలలు ఉండవు అనుకోవటం ఎంత మూర్ఖత్వమో, అలంటి ప్రశ్న కలగటం కూడా అంటే మూర్ఖత్వం. మానవునికి తెలివి ఉన్నది అర్థం లేని ప్రశ్నలు వెయ్యటానికి కాదు, మనకి తెలివి ఇచింది, మన జీవితం సుకృతం అయ్యే ప్రశ్నలు వేసుకోవటానికో లేక జీవన గమ్యానికి ఉపయోగ పడే ప్రశ్నలు వేసుకోవటానికే కాని ఇలా పనికి మాలిన ప్రశ్నలు అడగటానికి కాదు. హీరోయిన్ బెదురు చూపులు, హీరో గుడి ముందు బిత్తర చూపులతో దండం పెట్టుకోవటం గతి తోచని గమ్యానికి సూచనలు గా చూపిస్తారు సినిమాలో. అలాగే సముద్రం లోంచి అలలు ఎలా వస్తాయో అలాగే మనిషి ఆలోచనలు కూడా వస్తాయి ఆ ఆలోచనల లోంచే ప్రశ్నలు వస్తాయి., అంతే కాని అలలు లేని సముద్రం, ఆలోచనలు లేని మనిషి ఉండడు. మరల కన్నులు , కలలు , నిద్ర వీటికి కూడా ఇదే logic apply అవుతుంది.



వలపేదో వల వేసింది వయసేమో అటు తోస్తుంది
గెలుపంటే ఏదో ఇంత వరకు వివరించే ఋజువేముంది
సుడిలో పడు ప్రతి నావ చెబుతున్నది వినలేదా


హీరో హీరోయిన్కి నిజం గానే ప్రేమ వల వేస్తుంది, ఇంకానేమో దానికి వయసు తోడయ్యి వాళ్ళు ఆ నిర్ణయం తీసుకునేటట్టు చేస్తుంది, ఇక్కడ నిక్కచ్చి గా అడుగుతున్నట్టు ఉంటుంది, ఏమి సాధిద్దామని మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు, ఎవరి మీద గెలుపు పొందుదామని మీరు ఇది చేస్తున్నారు, అసలు మీ గెలుపుకి ఒక అర్థం అంటూ ఉందా?? ఇప్పుడు వెళ్ళిపోయి గెలిచాం అనేదాన్ని వివరించే రుజువేమి లేదు కదా, మీ ప్రియునితో, (ప్రియురాలితో) శాస్వతమైన సుఖం కోల్పోతున్నాం అన్న ఆలోచనలో అందరిని వదిలేసి ఏమి గెలుద్దామని మీరు మీ ప్రయాణం మొదలు పెట్టారు? దశ, దిశ లేని ప్రయాణం సుడి లో కొట్టుకొని పోయే నావ మనకు రుజువు చేస్తోంది కదా అది మీరు వినలేదా అన్న ప్రశ్న కనపడుతుంది. అది తెల్సి కూడా ఏమి గెలుద్దామని ప్రయత్నిస్తున్నారు అన్న ప్రశ్న కలుగుతుంది. సినిమాలో ఇద్దరు పిల్లలు హోలీ ఆడుకుంటే షర్టు గుర్తుకువచ్చి అది తేలేదని మర్చిపోయానని తనని నిందించుకుంటూ తిరిగి ఇంటికి వెళ్తాడు, అప్పుడు తన ఒక ఊహించని సంఘటన జరుగుతుంది.


పొరబాటున చేజారిన తరుణం తిరిగొస్తుందా
ప్రతి పూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా

ఒక చిన్న తప్పటడుగు వాళ్ళ కోల్పోయిన అవకాశాలు తిరిగి రావు అలాగే మనం కోల్పోయిన అవకాశాలు మల్ల మనకి అడుగడుగునా గుర్తుకు రావు, కాలం గుర్తు చెయ్యదు, ప్రతి పూట ఒక పేజిలా, పాఠం లాగా వివరించదు అని మరల హెచ్చరిస్తారు.

మన కోసమే తనలో తను రగిలే రవి తపనంతా
కనుమూసిన తరువాతనే పెను చీకటి చెబుతుందా

సూర్యుడు అందరికి వెలుగునివ్వటానికి  ఎంత కష్టపడతాడో మనకి చీకటిని చూస్తే కాని అర్థం కాదు. సిరివెన్నెల గారికి  సూర్యుడు అంటే అత్యంత ప్రీతి, కవి ని సూర్యుడిని పోలుస్తూ "జగమంత కుటుంబం" పాట రాసారు, అలాగే చాల పాటల్లో సూర్యుడి గురించి వింటాం. ఇక్కడ సినిమాలో హీరో తండ్రి చనిపోవటం, తండ్రిని సూర్యునితో పోలుస్తున్నరేమో ఇక్కడ. కొడుకు కోసం తండ్రి పడే తపన, అతని కోసం అహర్నిశలు పనిచేసి చివరకు కన్ను మూస్తే, కొడుకు బ్రతుకు చీకటి మయం అయ్యి కొడుకుకు తండ్రి విలువేంటో, ఇంక తను చెయ్యవలసిన పనులేంటో హీరో కి తెలుస్తుంది అని ఈ వాఖ్యలకి వివరణ గా చూసుకోవచ్చు. అందుకనే తల్లి ఆ మాటలు అంటుంది " దేవుడు చాల గోప్పవాడనుకుంటున్నాడు, మీ నాన్నని తీసుకు వెళ్లి పోయాను అని సంబర పడిపోతున్నాడు, నువ్వు లేవ నాకు?" 

కడ తేరని పయనాలెన్ని పడదోసిన ప్రణయాలెన్ని

అని తిరగేశాయా చరిత పుటలు వెనుజూడక ఉరికే వెతలు
తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు
ఇది కాదే విధి రాత అనుకోదేం ఎదురీత   || పది నెలలు || 


ఇంక చివరిగా ప్రేమ చరిత్ర గురించి విశ్లేషణ లో గమ్యం చేరని ప్రేమ వ్యవహారాలు ఎన్ని ఉన్నాయో, అలాగే పడదోసిన ప్రేమలు ఇవ్వన్ని లెక్కలు చూసి చరిత్రని చూసి ప్రేమించారు, అలాగే ముందడుగు వెయ్యరు కదా ప్రేమికులు, తమ ప్రేమ వ్యవహారం ఎవ్వరికి ఉదాహరణ కానక్కర్లేదు, తమ జీవితం తమదే కదా, ఇప్పుడు ఏమి చెయ్యాలి అని అనుకోవటం అర్థం లేదు ఎందుకంటే, ఒక అడుగు వేసి జరగబోయేదంత మన తలరాత అనుకోవటం కుదరదు అని నిక్కచ్చి గా చెప్తారు సిరివెన్నెల గారు. ఎదురీత అంటేనే ప్రవాహానికి ఎదురుగా వెళ్ళేది, అల వెళ్తూ ఇదంతా తన తలరాత అనుకోవటం కుదరదు కదా, అలాగే ప్రేమ జంటలు కాలానికి, ప్రకృతికి విరుద్దం గా తమకు తామే తమ గమనాన్ని నిర్దేసించుకొని ఇంక జరగబోయేది అంత తలరాత అనుకోవటం, ఏది జరిగితే అదే చేద్దాం అనే ఆలోచనని ఖండిస్తున్నట్టు ఉంటుంది.

ఒకటి  పొందలనుకుంటే ఇంకోటి కోల్పోవాలి అనే రీతిలో ఉంటారు ప్రేమికులు. తల్లి తండ్రులని కోల్పోతే కాని ప్రేమ దక్కదు, వాళ్ళే మొదటి అడ్డంకులు, మొదటి విలన్లు అనుకోవటమే ప్రేమ లో జరిగే చాల అనర్థాలకు కారణం. అది తప్పు అని వాళ్ళకి చాల కోల్పోయిన తరువాత అర్థం అవుతుంది. అది కాక పిల్లల ప్రేమ గురించి పెద్దలు మొదటి సారి ఎవ్వరి దగ్గరనుంచో వింటారు. అది కూడా పెద్దవాళ్ళకి నచ్చని పని.  ప్రేమికులు చేసే దొంగ చాటు గా కలయికలు, వాటి గురించి అందరితో ఆడే అబద్దాలు, వాళ్ళు చేసే ప్రతి పని ఎవరైనా చూస్తారో, చూసి ఇంట్లో చెప్తే ఏమవుతుంది అని భయపడుతూ, అన్ని విషయాలు దాస్తూ  చేసే పనులలో వాళ్లకి ఎంత ఆనందం ఉంటుందో తెలియదు కాని వాళ్ళు ఒకవేళ ప్రేమని పొంది జీవిత చక్రం లో పడితే ఆ ప్రేమ ఉంటుందా లేదా అన్నది వేరే విషయం. లేదంటే ఇన్ని ప్రేమ వివాహాలు బద్దలు కావు.  ఆకర్షణ తో చేసే  పని ఎలా ఉంటుందో చెప్పటానికి ఈ పాట అడుగడుగునా ఉపయోగపడుతుంది. అందుకనే సినిమా లో చివరిగా " వేసే ప్రతి అడుగు ఒకటికి పది సార్లు అలోచించి వెయ్యండి అనే సందేశం ఇస్తారు, అంటే కాక పిల్లలు పెద్దలు చివరకి కోరుకునేది ఆనందమే, అది మేము ఇవ్వగలం అని తల్లి తండ్రులు అనుకుంటే, వాళ్ళ ప్రేమలో నిజాయితీని పెద్దలు అర్థం చేసుకుంటే ప్రతి ఇల్లు ఒక కొత్త బంగారు లోకమే" అనే చక్కటి సందేశం తో సినిమా ముగుస్తుంది..

కొసమెరుపు: ఈ పాట రాసినందుకు సిరివెన్నెల గారికి కాని పాడినందుకు బాలు గారికి కాని నంది అవార్డు కూడా రాకపోవటం.