Thursday, January 26, 2012

Song of the Week - Poosindi Poosindi Punnaga

ముందు మాట : Instead of posting same matter every time, providing the link to one of the earlier posts. ( What inspired me to write this series)
Movie Name:             సీతారామయ్యగారి మనవరాలు
Producer:                         V.M.C. Productions
Director:                   క్రాంతి కుమార్
Music Director:                 కీరవాణి MM
Singer(s):                         S.P. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
Lyrics:                               వేటూరి సుందరరామ మూర్తి
Year of Release:              1991
పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగ
సందేల లాగేసే సల్లంగ దాని సన్నాయి జెళ్ళోన సంపెంగ
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై ఆడ జతులాడ

పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగ
సందేల లాగేసే సల్లంగ దాని సన్నాయి జెళ్ళోన సంపెంగ

ఇష్టసఖి నా చిలుక నీ పలుకే బంగారంగా
అష్టపదులే పలికే నీ నడకే వయ్యారంగా
కలిసొచ్చేటి కాలాల కౌగిల్లలో కలలొచ్చాయిలే
కలలొచేటి నీ కంటి పాపయిలే కధ చెప్పాయిలే

అనుకోని రాగమే అనురాగ గీతమై వలపన్న గానమే ఒక వాయులీనమై పాడే మది పాడే  ||పూసింది పూసింది||

పట్టుకుంది నా పదమే నీ పదమే పారాణిగా
కట్టుకుంది నా కవితే నీ కళలే కల్యాణిగా
అరవిచ్చేటి ఆభేరి రాగాలకే స్వరమిచ్చావులే
ఇరుతీరాల గోదారి గంగమ్మకే అలలిచ్చావులే

అల ఎంకి పాటలే ఇల పూల తోటలై, పసిమొగ్గ రేకులే పరువాల చూపులై , పూసే విరబూసే  ||పూసింది పూసింది||
సీతారామయ్యగారి మనవరాలు, ఈ సినిమా చూసి స్పందించని తెలుగు వాడు ఉండదేమో, సీతారామయ్య గారిని, అయన మనవరాలిని తమలో ఊహించని తాత మనవరాళ్ళు మన తెలుగు నాట ఉండరేమో. అంతగా అందరిని కదిలించిన సినిమా ఇంకోటి లేదు. ఒక తండ్రి, కొడుకు మధ్య ఉండే బంధం ఎంత మధురమైనదో, మనస్పర్ధలు వస్తే ఎంత కఠినం గా ఉంటుందో వారిద్దరూ ఎంత నరకం అనుభవిస్తారో చెప్పిన సినిమా ఇది. అక్కినేని, మీనా ఈ పాత్రల్లో జీవించడం మాత్రమే కాదు ప్రాణం పోసారు. అడుగు అడుగున తెలుగుతనం ఉట్టిపడే ఈ సినిమా కల కాలం నిలిచి పోయింది. కొడుకు అంటే అంత్యంత ఇష్టమైన తండ్రికి ఆ కొడుకు లేడు అనే నిజం చెప్పలేక పడిన సంఘర్షణలో హీరోయిన్ గా మొదటి సినిమా లో ఎంతో అద్బుతమైన నటనతో ఆకట్టుకున్న మీనా తెలుగింటి ఆడపడుచు గా అందరి మన్ననలు పొందింది.

ఇందులోని అన్ని పాటలు వేటూరి సుందర రామ మూర్తి గారు రాసారు. ఒక్కో పాట ఒక్కో మణి హారం. ఒక సుందర కావ్యం. గోదావరి తీరమంత సుందరం. తెలుగుతనం లో తీయనిదనం అడుగడునా ఉట్టి పడే ఆ సాహిత్యం వింటే వేటూరి గారి లోని సాహితి సరస్వతికి ఎన్ని కోట్ల సార్లు నమస్కరించిన సరిపోదు. కీరవాణి గారు ఆ సాహితి సంపద కి అద్దిన సొగసులు చెప్పనలవి కాదు. ఇంక గాయని గాయకులు సంగీత సాహిత్యం కలిసి చిలుకగా వచ్చిన అమృతాన్ని దేవతలు గా మారి మన చెవిలో పోసారు.

ఈ సినిమా లో గణేష్ పాత్రో గారు రాసిన మాటలు కూడా హృదయాన్ని బలం గా తాకుతాయి. సినిమా కథ అంతటి మూలం మొదట వచ్చే ఒక సన్నివేశం. ఆ సన్నివేశం లో " నా మాటకి విలువలేదు, తన మనసుకే విలువ ఎక్కువ అన్నాడు, మంచిదే, కాని 25 సంవత్సరాలు గా ప్రపంచములోని భాషంత నా తో మాట్లాడటానికే పని పెట్టుకున్న నా బిడ్డ, తన మనసులో ఏముందో నాతొ మాట వరుసకైన చెప్పక పోవటం నా మీద గౌరవం కాదు తిరస్కరణ" ఈ ఒక్క సంబాషణ చాల చెప్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళ పట్ల తల్లి తండ్రుల స్పందన ఇలాగె ఉంటుంది ఏమో. ఇట్లాంటి సన్నివేశాలు ఎన్నో. ఆ సన్నివేశాలు పండించిన తీరు, దర్శక నిర్మాతలకి ఒక మంచి సినిమా తీసాము అని వాళ్ళ జీవితానికి సరిపడే సంతృప్తిని ఇస్తాయి.

ఇంకా ఈ పాట కి వస్తే, సీతారామయ్య గారింట్లో పెళ్ళికి అమెరికా నుంచి మనవరాలు వస్తుంది. ఆ పెళ్లి జరిగేలోపు అందరితోను కలిసి పోయి ఆత్మీయురాలవుతుంది. ఆ విషయం నిద్రపోయే ముందు ఈ లోకం లో లేని తండ్రికి ఉత్తరం రాసి, పొద్దున్నే "Jogging" కి  వెళ్తుంది. అక్కడ కాశి బావ ఎదురయితే సరదాగా మాట్లాడుతుంది. పొలం కి వ్యవసాయం కాదు తాతకి సాయం చెయ్యటానికి వెళ్తున్న బావ తో, నువ్వు అక్కడే ఉంటావు గా  ఏదో సమయం లో పొలంకి వస్తాను అక్కడే ఉండు అంటుంది.  కాశి పొలం పంపు దగ్గర పని చేస్తూ ఉండగా, ఎక్కడ నించో కమ్మటి violin వాయిద్యం వినిపిస్తే ఆశ్చర్య పోయి చూస్తాడు. అక్కడ ఇంతకీ తన మరదలు సీత. మరదలిని పొగడిన తరువాత పిల్లోడు చెప్పిన పైత్యం అదే కవిత్వం గురించి విని సరదాగా పందెం మొదలు అవుతుంది, అదే పాట అవుతుంది.

తెలుగు తనం అంత రంగరించిన సన్నివేశం లో పాట ఆవిష్కరిస్తుంది. పచ్చటి పొలం ఒక వైపు, గల గల పారే పొలానికి సాగు నీరు ఒక వైపు, ఇంకో వైపు బావ, పరికిణి కట్టుకొని పొడవాటి జుట్టు తో జడ వేసుకొని ఆ జడ కి జడ కుప్పెలు పెట్టుకొని, తలలో పువ్వులు పెట్టుకొని, నుదుట బొట్టు పెట్టుకొని పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి ఇంకో వైపు, ఆ అమ్మాయి ఆ బావకి మరదలు అయితే అంతకన్నా ఆహ్లాదమైన వాతావరణం వారికి ఇంకోటి ఉండదు. అటు వంటి వాతావరణం లో ఇద్దరికీ పోటి జరిగితే ఇద్దరిది గెలుపే. అందుకనేనేమో వాళ్ళ సంగీత సాహిత్య సమరం సగంలో ఆగిపోతుంది ఎందుకంటే అక్కడ గెలుపు ముఖ్యం కాదు.  కీరవాణి/వేటూరి గారు పోటి పడి సంగీత సాహిత్యం సమకూరిస్తే, బాలు, చిత్ర వీనుల విందు చేస్తారు. అందమైన పల్లె వాతావరణం, చెవులకి ఇంపైన చక్కని సంగీతం, చూడ చక్కని జంట, వాళ్ళకి వంకలు పెట్టి నవ్వించే ఒక పిల్లవాడు, అన్నింటికీ మించి సాహిత్యం, ఇంతకంటే విందు భోజనం ఏముంది, కళ్ళు, చెవులకి?

సరే ఇంక అమ్మాయి ట్యూన్ మొదలు పెట్టింది, మనం పాటలోకి వెళ్దాం, మొదటి ట్యూన్ కి వేటూరి గారు రాసిన సాహిత్యం,
పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగ
సందేల లాగేసే సల్లంగ దాని సన్నాయి జెళ్ళోన సంపెంగ
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై ఆడ జతులాడ

ఒక్కో వాక్యం అమ్మాయి వాయించిన ఒక్కో ట్యూన్ కి సరిపోయే అందమైన పద సమీకరణ. ఆకలి రాజ్యం లో ఇటువంటి పాట మొత్తం ఉంటుంది, కాని ఈ సినిమా లో పల్లవి కే సరిపెట్టేసారు. అది ఎందుకో మరి. వేటూరి గారి పదం సరళమైన దాని అర్థం లోతైన సముద్రం అంత. ఎందుకంటే ఈ పల్లవి లోని అర్థం అటువంటిది. ఇక్కడ చూస్తె "పూసింది పున్నాగ" "సన్నాయి జడ", జడ కుప్పెలై"  "సందేల లాగేసె" ఈ పదాలు చూస్తె ఎలా అల్లెసారో అది అనితర సాధ్యమేమో అనిపిస్తుంది. పున్నాగ పువ్వు చిన్నగా తెల్లగా ముడుచుకొని ఉంటుంది మొగ్గ గా ఉన్నప్పుడు. అమ్మాయి ని పున్నాగ పువ్వు అంటే స్వచ్చమైన తెల్లదదనంతో ( ముత్యమంత తెల్లదనం) అమ్మాయిని పోల్చిన వేటూరి గారు, ఆ అమ్మాయి నవ్వు ఆ పున్నాగ పువ్వు వికసిస్తే ఎలాగా ఉంటుందో అలాగా ఉంటుంది అంటారు. అంటే మొత్తం తెల్లదనం తో నిండి స్వచ్చం గా ఉండటమే కాదు అంత ఆహ్లాదం గా ఉంటుంది. అసలు మనలో చాల మందికి ఆ పున్నాగ పువ్వు ఎలా ఉంటుందో కూడా తెలియదు, అలాంటి పువ్వుని అమ్మాయి నవ్వు తో పోల్చటం కవి ఊహ శక్తికి నిదర్శనం. అయిన కవి కి తెలియని భాష ఉండదు, భావం ఉండదు, కవి ఊహా శక్తికి అంతు  అంటూ ఉంటుందా?. ఇంత పోలికకే మనం ఆశ్చర్యపోతే, ఇంకా ముందు ఉంది.  సన్నాయి జడ అంటే రెండు రకాలు గా చెప్పుకోవచ్చు, ఒకటి దట్టమైన నలుపు, సన్నాయి అంత పొడవు అని కూడా చెప్పొచ్చు, అంతటి జడలో సంపెంగ పెట్టుకుంటే సంధ్య వేల చల్లదనం ఉన్నట్టు హాయిగా ఉండదా? సంపెంగలు సాయంత్రం సువాసనలు వెదజల్లుతాయి, ఆ సువాసన చల్లదనం లాగ నీ నవ్వు అంత హాయిగా ఉండదా??? ఇంక మనం ఇప్పుడు చూడటం లేదు కాని జడ కుప్పెలు పెట్టుకోవటం తెలుగు వాళ్ళకి చాల సరదా. పిల్లలకు ఉన్న లేకపోయినా పెద్దవాళ్ళకు అంతులేని సరదా. జడ కుప్పెలు పెడితే మూడు ఉంటాయి. వేటూరి గారు, ఆ మూడిటిని ముల్లోకాలు గా ఊహించడం ఆ జడకుప్పేలు అమ్మాయి నడుస్తూ ఉంటె అటు ఇటు  లయ బద్దం గా నాట్యం ఆడటం చూస్తె మగ వారి మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. అదే వరస కుదిరిన మరదలు అయితే? ఈ పల్లవి ఇంత అత్యద్భుతం గా రాయటం వేటూరి గారికి తప్ప ఇంక ఎవరికీ సాధ్యం కాదేమో. ఇక్కడ నుంచి పాట మలుపు తిరిగి పోటి ఆగిపోయి ఎవరికీ వారు పాడేసుకుంటారు. ఇంకా కొనసాగితే వేటూరి గారు మనల్ని ఎక్కడి తీసుకు వెళ్ళేవారో?  ( సినిమా లో హీరోయిన్ కి మూడు కుప్పెలు పెట్టకుండా వదిలేసారెందుకో దర్శకులు?

ఇష్టసఖి నా చిలుక నీ పలుకే బంగారంగా
అష్టపదులే పలికే నీ నడకే వయ్యారంగా

కలిసొచ్చేటి కాలాల కౌగిల్లలో కలలొచ్చాయిలే
కలలోచ్చేటి నీ కంటి పాపాయిలే కధ చెప్పాయిలే

అమ్మాయిలకి చిలుక ప్రియమైన స్నేహితురాలు,  ఆ చిలుకపలుకులు చాల బాగుంటాయి, చిలుక పలికే ప్రతి పలుకు బంగారమే. అలాంటి బంగారం లా ఉన్నాయి నీ పలుకులు అంటూ అమ్మాయి చిలుకని పొగడుతూ అతని సాహిత్యం, మాట అంత గొప్పగా ఉన్నాయి అని అబ్బాయిని పోగాడితే, అతను మాత్రం తక్కువ తింటాడ? మల్ల వేటూరి గారు కవితా శక్తి అబ్బుర పరుస్తుంది. అష్ట పదులు అంటే రాధ కృష్ణుని ప్రేమ ని పాడే ఎనిమిది పదాలు ఉన్న పాట. అది ప్రేమ కి చిహ్నం. అలాంటి పదాలు పలుకుతుంది నీ వయ్యారమైన నడక అంటాడు అబ్బాయి. మనిద్దరం కలిసోచ్చేటి కాలం లో జరిగే ఆలోచనలలో కలలు వస్తున్నాయి అంటే నీ కళ్ళలోని మెరుపు ఆ కథ నాకు చెప్తున్నయిలే అంటాడు అబ్బాయి. అంత వివరం గా చెప్తూనే, ఒకరిని ఒకరు పరిచయం, అర్థం చేసుకోవటం, మెచ్చుకోవటం జరుగుతుంది.

అనుకోని రాగమే అనురాగ గీతమై
వలపన్న గానమే ఒక వాయులీనమై
పాడే మది పాడే                                || పూసింది పూసింది ||
అనుకోని రాగం అనేది వేటూరి గారు రేపల్లియ ఎద ఝల్లున పాట లో అనగల రాగం, అనలేని రాగం అన్నట్టు, ఇక్కడ అనుకోని రాగం అంటారు, ఎందుకంటే, కథ లో సన్నివేశం చూస్తే వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నది అనుకోని రాగమే, అది అనురాగ గీతం గా మారింది, ఇద్దరు వయసు లో ఉన్నారు, ఆ వలపు వరసైన వారికి సహజం. ఆ ప్రేమ గానం వాయులీనం ఐతే వాళ్ళు పాడే పాట ఇద్దరి మనసులు పాడే పాటే....
 పట్టుకుంది నా పదమే నీ పదమే పారాణిగా
కట్టుకుంది నా కవితే నీ కళలే కల్యాణిగా

అరవిచ్చేటి ఆభేరి రాగాలకే స్వరమిచ్చావులే
ఇరుతీరాల గోదారి గంగమ్మకే అలలిచ్చావులే

అల ఎంకి పాటలే ఇల పూల తోటలై పసిమొగ్గ రేకులే పరువాల చూపులై పూసే విరబూసే  || పూసింది పూసింది ||
మరల వాళ్ళిద్దరి మధ్య అంతర్లీనం గా జరిగే సంబాషణ, చాల ఆసక్తి గా మారుతుంది. ఒకే పదాన్ని ఒకే వాఖ్యం లో వేరే అర్థాలు చెప్పటం లో దిట్ట వేటూరి గారు. నా పదం, నీ పదం, ఇక్కడ రెండు పదాలే కానీ ఒకటి కవిత లాంటి మాట, ఇంకోటి అడుగు.  తన పాదాల అడుగులకి అబ్బాయి కవితా పదాలు పారాణి గా పట్టుకుంటే, అమ్మాయి సంగీతం, అబ్బాయి కవిత్వానికి కల్యాణి రాగం లాగ మారి కట్టుకున్నావు గా, ఇలా ఇద్దరు ఒకరిని ఒకరు పొగడుతూ ఉంటె, ఇంక కొనసాగిస్తారు, ఆభేరి రాగం అరువివ్వటం ఎంట అని అనుకులే లోపల ఆ రాగానికే స్వరమిచ్చావు అని ఆశ్చర్య పరుస్తారు వేటూరి గారు, అసలు ఈ పోలికలు మనల్ని ఎక్కడికో తీసుకెళ్తాయి. గోదారి గంగమ్మ కి అలలు ఇవ్వటం, ఎంకి పాటలు ఎంత అద్భుతం గా ఉంటాయో, అవే మన చుట్టూ ఉన్న పూల మొక్కలు అటు ఇటు గాలికి ఊగుతూ ఉంటె అవి ఎంకి పాటలు లాగ ఉంటె, ఆ తోట లో పసి మొగ్గలు ఇద్దరి పరువాల చూపులకి పూసి విరబూస్తే ఎలాగా ఉంటాయి? అమ్మాయి నవ్వు లాగ, ఆ అమ్మాయి జడలోని సంపెంగ లాగ, ఆ జడ ఆడే నాట్యం లాగ.. 

ఈ పాట రాసి వేటూరి గారు మనల్ని వేరే ప్రపంచం లోకి తీసుకు వెళ్తారు తన పద మాయ జాలం తో. అసలు ఇటువంటి సాహిత్యం వినగలగడం మన అదృష్టం. ఇంకో అద్రుష్టం ఏమిటి అంటే, తెలుగు భాష కి ఉన్న అందం ఇటువంటి సాహిత్యం తెలియ చెయ్యగలగటం. ఆ తీయని తనాన్ని ఆస్వాదించటం మనకు తెలుగు వాళ్ళకు లభించే ఒక గొప్ప వరం.ఇప్పటి వరకు మంచి సాహిత్యాన్ని మంచి సంగీతం కుదరక పోవటం జరగలేదు, ఈ పాటకి కూడా కీరవాణి అంతే న్యాయం చేకూర్చారు.

కొస మెరుపు:
ఈ పాటతో సినిమా లో సీత కి కాశికి ఒక మంచి బంధంకి పునాది వేసినా ఆ తరువాత వాళ్ళ మధ్య ఏమి సన్నివేశాలు ఉండవు,. చివర్లో మరల సీతకి పెళ్లి ప్రస్తావన వచ్చినా అది అక్కడతో ఆగిపోతుంది. అయిన కథ, కథనం వీళ్ళ మీద కాదు కదా. ఏది ఏమైనా మనకి ఇంకో అధ్బుతమైన పాట వేటూరి గారి ద్వారా లభించింది. ఈ సినిమా మాతృక ఒక మలయాళం సినిమా(సాంత్వనం). కాని తెలుగుతనం ఉట్టి పడే ఈ సినిమాకి మాతృక ఏది అయితే మనకి ఏంటి?

ఈ సినిమా లో నాకు నచ్చిన మిగితా పాటలతో వచ్చే వారం కలుద్దాం---

2 comments: